కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి చిదంబరం, ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టై 24 గంటలు గడవక ముందే.. మరో సీనియర్ నేత, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అరెస్ట్ కు రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. 2014లో శశిథరూర్ భార్య, సునంద పుష్కర్ ఢిల్లీ లోని ఓ హోటల్ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఈ కేసుకు సంబంధించి, శశిథరూర్ పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సునందా మృతికి సంబందించిన పలు సాక్షాలు తమ వద్ద ఉన్నాయంటూ ఢిల్లీ పోలీసులు కోర్టు దృష్టికి తేవడంతో తీవ్ర కలకలం నెలకొంది.
సునందపుష్కర్ మరణించిన రోజు రాత్రి, ఓ పాకిస్తానీ జర్నలిస్టుకు శశిథరూర్ పంపిన పలు ప్రణయ సందేశాలను సునంద చూడటంతో వారి మధ్య గొడవ మొదలైందని, ఈ క్రమంలో ఆగ్రహం తట్టుకోలేని సునంద, శశిథరూర్ నిజస్వరూపాన్ని బాహ్యప్రపంచానికి తెలియజేస్తాననడంతో వారిద్దరి మధ్య జరిగిన పెనుగులాటలో సునందపుష్కర్ గాయాలపాలై మరణించిందని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. కాగా, భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు చెడటంతో ఆమె మానసిక స్థితి క్షీణించి ఆత్మహత్య చేసుకుందని శశిథరూర్ పోలీసుల ముందు పేర్కొన్నారు. అయితే ఢిల్లీ పోలీసులు ప్రవేశ పెట్టిన సాక్షాలను కోర్ట్ సమర్దిస్తే, శశిథరూర్ కి శిక్ష ఖాయంగా తెలుస్తోంది. ఇదే గనక జరిగితే కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలినట్టే.