అయోధ్యలో క్రీ.పూ. రెండో శతాబ్దంలో అతి పెద్ద రామాలయం ఉండేదని .. ‘ అయోధ్య వివాదం ‘ లో ఓ భాగమైన రామ్ లాలా విరాజ్ మాన్ తరఫు లాయర్ సీ.ఎస్. వైద్యనాథన్… సుప్రీంకోర్టుకు తెలిపారు. 1500 ప్రాంతం లో అక్కడే.. ఆ వివాదాస్పద స్థలంలోనే.. మొఘల్ పాలకులు బాబరీ మసీదును నిర్మించారని ఆయన చెప్పారు. అయోధ్య అంశంపై సుప్రీం కోర్టు వరుసగా రోజువారీ విచారణ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. ఏడో రోజైన శుక్రవారం వైద్యనాథన్ ఈ విషయం వెల్లడించారు. 1950 లో ఈ స్థలాన్ని తనిఖీ చేయాలని అప్పటి కోర్టు ఓ కమిషనర్ ని నియమించిందని, ఆ కమిషనర్ తన నివేదికలో ఈ అంశా న్ని పేర్కొన్నారని ఆయన తెలిపారు. భారత పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల ఆధారంగా తానీ విషయాన్ని తెలియజేస్తున్నానని ఆ కమిషనర్ రిపోర్టులో వెల్లడించారు. పురావస్తు తవ్వకాల్లో ఓ పెద్ద ఆలయం బయట పడిందని, ఆ స్పాట్ లో కృష్ణ, శివతాండవ, చిత్రాలతో కూడిన పలు స్తంభాలు, రాముడి చిన్నతనపు ఇమేజీ, సింహాల మధ్య గరుడునితో కూడిన విగ్రహాలు కనిపించాయి అని ఆ నివేదిక వివరించిందని వైద్యనాథన్ తెలిపారు. ఇస్లామిక్ సిధ్ధాంతాలకు, ఈ విగ్రహాలకు మధ్య అసలు పోలిక ఏమైనా ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి విగ్రహాలు ముస్లిముల పోకడకు పూర్తిగా విరుధ్దమైనవని అన్నారు. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలో అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం అయోధ్య అంశంమీద విచారణ జరుపుతోంది. మొదట్లో ఇది రహస్య విచారణ అని వార్తలు వచ్చినప్పటికీ.. ఆ తరువాత మీడియాకు ఈ విచారణ తాలూకు అంశాలను అందిస్తున్నారు.
ప్రస్తుతం అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో భారీ ఎత్తున బలగాలను మోహరించారు. సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత కొనసాగుతోంది. ముగ్గురు సభ్యులతో ఏర్పాటైన మధ్యవర్తిత్వ కమిటీ తమ వాదనలను కోర్టులో వినిపిస్తోంది.