విజయవాడ ప్రకాశం బ్యారేజి దగ్గర కృష్ణా నదికి బ్యారేజీ నుంచి భారీగా నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో నదీ పరీవాహక ప్రాంతాలు జల దిగ్భందంలో చిక్కుకున్నాయి. నగరంలోని కృష్ణలంక, బాలాజీ నగర్, రామలింగేశ్వర్ నగర్ లో వీధులన్నీ జలమయమయ్యాయి. చాలా ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 140మంది అగ్నిమాపక శాఖ సిబ్బంది విధుల్లో ఉన్నారు. ముంపు అధికంగా ఉన్న 10 మండలాల్లో 18 బోట్లతో సహాయ కార్యక్రమాలు చేపట్టారు. రెండు జిల్లాల్లో 180 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది విధుల్లో ఉన్నారు.
రామలింగేశ్వర నగర్ లో విధుల్లో ఉన్న ఫైర్ సిబ్బంది సాహసం చేశారు. ప్రాణాలను రిస్క్ లో పెట్టి వరద బాధితులను కాపాడుతున్నారు. ఒక బాలింతను ఫైర్ సిబ్బంది జాగ్రత్తగా సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఓ ఫైర్ సిబ్బంది తనే స్టూల్ గా మారి బాలింతకు ఊతమిచ్చాడు. ఆయన వీపుపై కాలు మోపి ఆ బాలింత సురక్షితంగా కిందకు దిగింది. ఫైర్ సిబ్బంది సాహసాన్ని, విధి నిర్వహణలో అంకిత భావాన్ని ప్రశంసిస్తున్నారు.