తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద డ్రోన్ చక్కర్లు కొట్టడంపై ఈరోజు టీడీపీ నేతలు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్ కాగా, వరద పరిస్థితిపై అంచనా కోసం తామే విజువల్స్ తీయాల్సిందిగా ఆదేశించామని ఏపీ జలవనరుల శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇంటి వద్దకు భారీగా టీడీపీ శ్రేణులు చేరుకోగా, పోటీగా అక్కడకు వైసీపీ కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు.
తాము ఆళ్లరామకృష్ణారెడ్డి అనుచరులమని వాళ్లు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ-వైసీపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అది కాస్తా శ్రుతిమించడంతో ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. ఈ గొడవ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు డొక్కా మాణిక్యవరప్రసాద్, వర్ల రామయ్య, ఆలపాటి రాజా, మద్దాల గిరి హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. దీంతో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద హైటెన్షన్ నెలకొంది.