హైదరాబాద్: జమ్మూకశ్మీర్లో సోమవారం నుంచి స్కూళ్లు, ప్రభుత్వ ఆఫీసులు తెరుచుకోనున్నాయి. గత 12 రోజులుగా కశ్మీర్లో ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. ఆర్టికల్ 370 రద్దుతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కశ్మీర్లో విధించిన ఆంక్షలను త్వరలోనే ఎత్తివేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇవాళ సుప్రీంకోర్టుకు తెలిపింది. ప్రతి రోజు భద్రతను సమీక్షిస్తున్నామని, ఏజెన్సీలను సుప్రీం విశ్వసించాలని కేంద్రం వెల్లడించింది. జమ్మూలో ల్యాండ్లైన్, మొబైల్ ఫోన్లపై ఉన్న ఆంక్షలను ఎత్తివేశారు. కానీ శ్రీనగర్లో మాత్రం ఇంకా ఆంక్షలు అమలులో ఉన్నాయి. ఇంటర్నెట్పై మాత్రం ఇంకా కొన్ని రోజుల పాటు ఆంక్షలు కొనసాగించనున్నారు.