క్రికెట్ భారత జట్టు సారధి విరాట్కోహ్లీ సోమవారం విండీస్ లెజెండరీ బ్యాట్స్మన్ సర్ వివ్ రిచర్డ్స్ను కలిశారు. ఆయనతో కలిసి దిగిన ఫొటోని కోహ్లీ ట్విటర్లో పోస్టు చేస్తూ.. ‘బిగ్గెస్ట్ బాస్తో’ అని పేర్కొన్నాడు. కాగా విండీస్ దిగ్గజం ఇదివరకే కోహ్లీని ఓ సందర్భంలో కొనియాడిన విషయం విధితమే. మైదానంలో కోహ్లీ దూకుడు చూస్తే.. క్రికెట్ ఆడేటప్పుడు నేనూ అలా ఉండేవాడినని పేర్కొన్నారు.
‘కోహ్లీకి నేను వీరాభిమానిని. అతడి బ్యాటింగ్, దూకుడుతనం అంటే చాలా ఇష్టం. ఆస్ట్రేలియాపై ఎవరైనా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తే బాగా ఇష్టపడతా. విరాట్ ఎంతో ప్రత్యేకం. నేనూ తనలాగే ఆడేవాడిని. వివ్రిచర్డ్స్, విరాట్ ఒకే జట్టులో ఆడితే ఎలా ఉంటుందో మీరు ఊహించగలరా?’ అని పేర్కొన్నారు. రిచర్డ్స్ విండీస్ తరఫున 121 టెస్టుల్లో 8540 పరుగులు చేయగా 187 వన్డేల్లో 6721 పరుగులు చేశాడు. విండీస్తో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్ను కోహ్లీసేన ఇప్పటికే 2-0తో కైవసం చేసుకోగా ఇక మిగిలిన ఆఖరి మ్యాచ్నూ గెలిచి సిరీస్ను క్లీన్స్వీప్ చేయాలని భావిస్తోంది. విండీస్ ఆఖరి మ్యాచ్నైనా గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తోంది. ఈ రోజు రాత్రి గయానాలో మూడో టీ20 జరగనుంది. ఈ సిరీస్ తర్వాత టీమిండియా మూడు వన్డేలతో పాటు రెండు టెస్టులు ఆడనుంది.