వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో కొనసాగుతోంది. రానున్న 48 గంటల్లో ఈశాన్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లోనూ అల్పపీడనం ఏర్పడనుంది. మరింత బలంగా రుతుపవనాలు కదులుతున్నాయి. దీని ప్రభావంతో కోస్తాలో పలుచోట్ల భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరకోస్తా తీరం వెంబడి గంటకు 65 నుంచి 70 కిమీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని చెప్పారు. విశాఖ, గంగవరం, భీమునిపట్నం, కళింగపట్నం, కాకినాడ పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు ఆదేశించారు.
ఐదు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీ, తెలంగాణకు జీవధారమైన కృష్ణ, గోదావరి నదుల ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు పెరుగుతున్నాయి. దీంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తర ఒడిశా మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో మంగళవారం అల్పపీడనం ఏర్పడింది. ఇది ఛత్తీస్గఢ్ను ఆనుకుని ఉన్న తూర్పు మధ్యప్రదేశ్ మీదుగా సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనంతో కలిసిపోయింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
బంగాళాఖాతంలో ఆదివారం(ఆగస్టు 04,2019) ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో మరో రెండు రోజులపాటూ తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కురవడం ఖాయం అని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఏపీలో తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. తెలుగు రాష్ట్రాలకు మంచి రోజులు వచ్చినట్లే అని అధికారులు అంటున్నారు. ఇన్నాళ్లూ వానలు పడకుండా... మేఘాలు మొండికేశాయి. రుతుపవనాలు దేశమంతా విస్తరించి, అన్ని చోట్లా వానలు పడినా... ఏపీ, తెలంగాణలో మాత్రం సరైన వానలే పడలేదు. ఇప్పుడు సీన్ మారింది. జోరు వానలు పడుతున్నాయి.