బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో నెలకొన్న ఉత్కంఠ కొనసాగుతోంది. కాంగ్రెస్-జేడీ(ఎస్) సంకీర్ణ ప్రభుత్వంలో సీఎం హెచ్ డీ కుమారస్వామి బలపరీక్షపై మరికాససేపట్లో ఓటింగ్ జరుగనుంది. శాసనసభలో విశ్వాసపరీక్షపై కాంగ్రెస్ నేత సిద్దరామయ్య, మాట్లాడుతున్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత ఓటింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు. విధానసభకు 105 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే శంకర్ హాజరవగా..కాంగ్రెస్-జేడీఎస్, బీఎస్సీ (ఒకరు) నుంచి 101 మంది హాజరయ్యారు. సభలో మెజార్టీకి కావాల్సిన సంఖ్యాబలం 103 మంది కావాలి. స్పీకర్, నామినేటెడ్ ఎమ్మెల్యే మినహాయిస్తే సభలో అధికార పార్టీ సభ్యుల బలం 99గా ఉంది. కాగా సభకు 18 మంది ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. సభకు గైర్హాజరైన వారిలో 15 మంది రెబల్ ఎమ్మెల్యేలు, స్వతంత్ర ఎమ్మెల్యే ఉండగా..కాంగ్రెస్ సభ్యులు శ్రీమంత్ పాటిల్, నాగేంద్ర అనారోగ్యం కారణంగా సభకు రాలేదు. బీఎస్పీ ఎమ్మెల్యే ఎన్ మహేశ్ ఆ పార్టీ అధినేత్రి మాయావతి ఆదేశాల మేరకు తొలుత విశ్వాస తీర్మానంపై ఓటింగ్ కు దూరంగా ఉండనున్నట్లు చెప్పారు. తాజాగా ఆయన సీఎం కుమారస్వామికి మద్దతు తెలిపారు. నాటకీయ పరిణామాల మధ్య పూర్తి సభ్యుల మద్దతుతో సీఎం కుమారస్వామి ప్రభుత్వం గట్టెక్కనుందా? లేదా వేచి చూడాలి.