రాష్ట్ర ప్రయోజనాలపై పరితపించే వ్యక్తిగా కాంగ్రెస్ మాజీ ఎంపీ, సీనియర్ నేత ఉండవల్లి అరుణ్కుమార్కు పేరుంది. గత ప్రభుత్వ హయాంలో ప్రతి విషయంపైనా ప్రేస్మీట్ పెట్టి మరీ విమర్శలు గుప్పించిన ఆయన ఇటీవల సైలెంట్ అయిపోయారు. ఆ మధ్య ఆయన వైసిపిలో చేరి ప్రభుత్వంలో మంత్రి పదవి కూడా అందుకోబోతున్నారని కొందరంటే... లేదు లేదు ఆయనని ఢిల్లీలో వ్యవహారాలు చూసేందుకు ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తారని మరికొందరు ట్రోల్ చేసారు. అంతవరకు బాగానే ఉంది. ఇటీవల ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గోదావరి జలాలను శ్రీశైలానికి తరలించే కొత్త ప్రతిపాదనలు తీసుకు వచ్చారు. ఇది రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తాయనే అనుమానాలు చాలానే వినిపిస్తున్నాయి. ఈ విషయమై కనీసం నోరు విప్పి ఉండవల్లి మాట్లాడకపోవటం పట్ల కొందరు ఎన్నారైలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓ లేఖ రాసినట్టు తెలుస్తోంది. ప్రవాసాంధ్రులు రాసినీ లేఖ లో ఏపీ ప్రయోజనాలు, గోదావరి జలాల విషయమై ప్రస్తావిస్తునే "ఏపీ ప్రయోజనాల కోసం తపించే వ్యక్తిగా అనేక అంశాలపై సుప్రీంకోర్టు తలుపులు తట్టిన మీరు కొద్ది రోజులుగా విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలు.. గోదావరి జలాల విషయమై స్పందించి వీటిపై మాట్లాడాలని, ఇరు ప్రభుత్వాలు చేస్తున్న వ్యవహారాలు మన రాష్ట్రానికి ఎంతవరకు మేలు చేస్తాయో? లేక మన ప్రయోజనాలపై దెబ్బతీసే అవకాశాలున్నాయో బహిరంగంగా చర్చించాలకోరారని తెలుస్తోంది. మరి ఈ లేఖపై ఉండవల్లి ఎలా స్పందిస్తారో చూడాలి.