బాలాకోట్ దాడుల అనంతరం పాకిస్థాన్ తన గగనతలంపై వివిధ దేశాలకు ఆంక్షలు విధించింది. ఫిభ్రవరిలో బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ తర్వాత పాకిస్థాన్ అధీనంలో 11 వాయు మార్గాలు ఉండగా కేవలం రెండు రూట్లలో మాత్రమే భారత విమానాలు ప్రయాణించేందుకు పాక్ అనుమతించింది. అయితే నుంచి పాక్ ఇప్పటవరకు విధించిన ఆంక్షలన్నింటినీ ఎత్తేసింది. మంగళ వారం నుంచి అన్నిరూట్లలో విమానాలు తిరిగేందుకు అనుమతి ఇచ్చింది. అయితే పాకిస్తాన్ గగనతలం మూసివేయడం వల్ల వివిధ అంతర్జాతీయ విమానాలను తిరిగి మార్చుకోవాల్సి రావడంతో సుమారు రూ. 491 కోట్ల రూపాయల భారీ ఆర్థిక నష్టాన్ని చవిచూసిన ఎయిర్ ఇండియాకు పాక్ తీసుకున్న ఈ నిర్ణయంతో పెద్ద ఉపశమనం కలిగినట్లైంది.
ఈ రోజు తెల్లవారుజామున 12.41 గంటల నుంచి పాకిస్తాన్ అన్ని విమానయాన సంస్థలను తన గగనతలంలో ప్రయాణించడానికి అనుమతించింది. దీంతో భారతీయ వైమానిక ఆపరేటర్లు త్వరలో పాకిస్తాన్ గగనతల ద్వారా సాధారణ మార్గాలను ఉపయోగించడం ప్రారంభించనున్నారు. పాకిస్తాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఇండియన్ స్టాండర్డ్ టైమ్లో తెల్లవారుజామున 12.41 గంటలకు ఎయిర్మెన్లకు నోటీసు జారీ చేసింది. "ప్రకటించిన ఎటిఎస్ (ఎయిర్ ట్రాఫిక్ సర్వీస్) మార్గాల్లో అన్ని రకాల సివిల్ ట్రాఫిక్ కోసం తక్షణమే పాకిస్తాన్ గగనతలం తెరిచి ఉంది" అని పేర్కొంది.
ఫిబ్రవరి 14 న పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం (ఐఎఎఫ్) బాలకోట్లో ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ (జెఎమ్) శిక్షణా శిబిరాలపై దాడులు చేసింది. ఫిబ్రవరి 26 న జరిగిన ఈ బాలాకోట్ ఆపరేషన్ తర్వాత పాకిస్తాన్ తన గగనతలాన్ని పూర్తిగా మూసివేసింది. అప్పటి నుండి, పొరుగు దేశానికి మాత్రమే అనుమతి ఇచ్చింది . అది కూడా మొత్తం 11 మార్గాల్లో రెండు మార్గాలు మాత్రమే దక్షిణ ప్రాంతం గుండా వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. బాలకోట్ స్ట్రైక్స్ తర్వాత భారత గగనతలంలో విధించిన అన్ని తాత్కాలిక ఆంక్షలు తొలగించినట్లు ఐఎఎఫ్ మే 31 న ప్రకటించింది. అయినప్పటికీ, పాక్ తన గగనతలంపై పూర్తిగా అనుమతి ఇవ్వకపోవడంతో ..పెద్దగా ఈ నిర్ణయం వాణిజ్య విమానాలకు ప్రయోజనం కలిగించలేదు.