అధికారంలోకి వచ్చింది లగాయతూ జగన్ తమను దోషిగా చూపడంపైనే దృష్టి సారించారని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. మంగళవారం ఆయన అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా అనేక ఆరోపణలు చేసిన జగన్ తన దగ్గర ఆధారాలు లేక అధికారులను బెదిరిస్తున్నారని, ప్రతిపక్షాన్ని దోషిగా చూపాలన్న ఉద్దేశ్యంతో రంధ్రాన్వేషణ చేసి పట్టుకుంటే ప్రమోషన్ ఇస్తానంటున్నారని ఎద్దేవా చేసారు. పీపీఏల విషయంలో కేంద్ర వైఖరితో రాష్ట్ర ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిందని, పీపీఏలలో ప్రభుత్వం జోక్యం స్వల్పం అని తెలుసుకోవాలని చెప్పారు. రాష్ట్ర చర్యలను కేంద్రం తప్పుపట్టడంతో జగన్ సర్కార్ పరువు నిలుపుకొనే ప్రయత్నం చేస్తోందన్నారు. సీఎం జగన్ తమ సండూర్ పవర్ కర్ణాటకలో యూనిట్ రూ.4.50కే పీపీఏ చేసుకున్నది వాస్తవం కాదా? అని పయ్యావుల నిలదీసారు.