హైదరాబాద్, మేజర్న్యూస్ : సంపూర్ణ మెజారిటీ ఉన్న తన ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు స్వయంగా సంకీర్ణ ప్రభుత్వం చేసేశారని వైసీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ఎద్దేవా చేశారు. గత అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి సొంతంగా 102 సీట్లు రాగా, ఇద్దరు స్వతంత్రులు, నలుగురు బీజేపీ సభ్యులు కూడా మద్దతు పలికారని దీంతో వాళ్ల మొత్తం బలం 108 అయ్యిందని గుర్తు చేశారు. అలాంటప్పుడు వైసీపీ నుంచి ఎన్నికైన 68 మందిలో 21 మందిని ఎందుకు తీసుకున్నట్లని ప్రశ్నించారు. ఇంతకుముందు కూడా వివిధ ప్రభుత్వాల్లో ఎన్నో పార్టీ ఫిరాయింపులు జరిగాయని చంద్రబాబు అన్నారని, కానీ వాస్తవాలు వేరని బుగ్గన చెప్పారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు మీద అసమ్మతి ఉన్నవాళ్లు అసమ్మతి నేతలుగా ఉండిపోయారు తప్ప కండువాలు కప్పుకొని కాంగ్రెస్ సభ్యులుగా కాలేదన్నారు. వాళ్లను ఆయన మంత్రులుగా కూడా చేయలేదని గుర్తు చేశారు. చంద్రబాబు మాత్రం 21 మందిని తీసుకుని వాళ్లను స్వయంగా కండువాలు కప్పి వారిలో నలుగురిని మంత్రులుగా కూడా చేశారని అన్నారు. కేబినెట్ విస్తరణలో భాగంగా నలుగురు వైసీపీ సభ్యులకు మంత్రి పదవులు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని రాష్టప్రతికి వినతిపత్రం ఇచ్చామని, రాజ్యాంగలోని 10వ షెడ్యూలు స్పష్టంగా పద్ధతులు చెబుతున్నాయన్నారు. చట్టాన్ని ఉల్లంఘించి ఇలా ముఖ్యమంత్రి ప్రతిపాదన మేరకు మంత్రులుగా ప్రమాణం చేయించడం తప్పని తెలియజేశామని అన్నారు. రాష్టప్రతికి తాము ఫిర్యాదుచేసిన మర్నాడే సీఎం మాట్లాడుతూ వైసీపీ అభివృద్ధికి వ్యతిరేకమని విమర్శించాడం, తమ పార్టీ నాయకత్వంపై ఆర్థిక నేరాల ఆరోపణలు చేయడం జరిగిందని పేర్కొన్నారు. చంద్రబాబు మాత్రం నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. సూట్కేసు కంపెనీలలో తమ పార్టీ అధ్యక్షుడికి రూ.1400 కోట్ల పెట్టుబడులు ఉన్నాయని ఆరోపించారని దాన్ని నిరూపించగలరా అని ప్రశ్నించారు. ఇంతకుముందు స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకంలో భాగంగా తనకు 13 వేల కోట్ల ఆస్తులు హైదరాబాద్లో ఎవరో వెల్లడిస్తే అది జగన్మోహన్రెడ్డేనని అంటూ ఏదేదో మాట్లాడారని చెప్పారు. చివరకు ఏమైందో అందరికీ తెలుసని అన్నారు. రాష్ట్రంలో 11.6 శాతం స్థూల ఉత్పత్తి పెరుగుదల ఉందని ఆయన చెప్పుకొన్నారని, చైనాకు కేవలం 6 శాతం ఉంటే భారతదేశానికి 7 శాతం ఎలా వచ్చిందని ప్రపంచ ఆర్థికవే త్తలు ఆశ్చర్యపోయారని పేర్కొన్నారు. కానీ బాబు మాత్రం ఏకంగా 11.6 శాతానికి వెళ్లారని మరి అభివృద్ధి ఎక్కడ ఆగినట్లని నిలదీశారు. పన్నుల ఆదాయం తగ్గినా ఇంత వృద్ధి ఎలా వచ్చిందని తాము ప్రశ్నించామన్నారు. ఆయన ఎక్కడ చూసినా తాత్కాలిక అభివృద్ధి మాత్రమే చూపిస్తున్నారని, టీడీపీ అంటే టెంపరరీ డెవలప్మెంట్ పార్టీ అనే అనిపించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాజధాని, అసెంబ్లీ, సెక్రటేరియట్, పట్టిసీమ, పురుషోత్తమపట్నం అన్నీ టెంపరరీయే అని చూపిస్తున్నారని వీటిలో దేన్నయినా తాము ఆపగలిగామా అని ప్రశ్నించారు. పట్టిసీమ ప్రాజెక్టుకు రూ. 1170 కోట్ల అంచనా వ్యయమే దండగ అని కాగ్ నివేదికలో చెప్పారని దాన్ని 1670 కోట్లకు పెంచి 500 కోట్లు చూపించారని అది ఎవరి జేబుల్లోకి పోతోందో అందరికీ తెలుసని అన్నారు. ఐదు రోజులలో కరువును జయించానని చెప్పే ధైర్యం వరుణ దేవుడు కూడా చేయలేడు గానీ చంద్రబాబు చేశారని అన్నారు. విశాఖలో నిర్వహించిన సీఐఐ సదస్సు తర్వాత రూ.10 లక్షల 50 వేల కోట్ల పెట్టుబడులు వచ్చేశాయని 22 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేస్తున్నాయని చెప్పారని వాటిని తాము ఏమైనా ఆపామా అని బుగ్గన రాజేందన్రాథ్ రెడ్డి అడిగారు.