ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు ఇంటిని ఖాళీ చేయాలి: ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 26, 2019, 11:09 AM

నియమ నిబంధనలకు వ్యతిరేకంగా చంద్రబాబు నివాసం ఏర్పరుచుకున్నారని, ఆయన తన ఇంటిని వెంటనే ఖాళీ చేయాలని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం రాత్రి నుంచే ప్రారంభమైన ప్రజావేదిక కూల్చివేత పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజావేదికను కూలగొట్టాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించడం హర్షణీయమని ఆళ్ల అన్నారు. గతంలో ఉండవల్లి ప్రాంతంలో రైతులను బెదిరించి కొందరు భూములను స్వాధీనం చేసుకున్నారని.. ఆ ప్రాంతంలోనే లింగమనేని గెస్ట్‌హౌస్, ప్రజావేదిక భవనాన్ని నిర్మించారని గుర్తు చేశారు.


కరకట్ట సమీపంలో అక్రమంగా పలు చోట్ల కట్టడాలు ఉన్నాయన్న ఆళ్ల.. వీటికి వ్యతిరేకంగా తాను హైకోర్టులో కేసు వేశానని, ప్రభుత్వం, చంద్రబాబు, అక్రమంగా నిర్మాణాలు చేసిన 57 మంది ప్రముఖులు తమ కౌంటర్లను దాఖలు చేయలేదని అన్నారు. హైకోర్టు ముందుకు ఈ కేసు విచారణకు రాకుండా చంద్రబాబు మేనేజ్ చేశారని దుయ్యబట్టారు. చంద్రబాబు ఉండవల్లిలో అక్రమంగా నిర్మించిన ఇంటిలో ఉంటూ రూ వంద కోట్ల నిధులతో హైదరాబాద్ లో పెద్ద భవనాన్ని నిర్మించారని ఆళ్ల నిప్పులు చెరిగారు.


 


మరోవైపు ఏపీ ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజావేదిక కూల్చివేతలకు వ్యతిరేకంగా హౌస్ మోషన్ దాఖలు అయిన పిటిషన్‌పై అర్ధరాత్రి రెండు గంటల సమయంలో హైకోర్టు డివిజన్ బెంచ్ అత్యవసరంగా సమావేశమై విచారించి, అది అక్రమ కట్టడమేనని తేల్చిందని తెలిపారు. ఉత్తరాదిన బియాస్ నదీ ప్రాంతంలో కాంగ్రెస్ ప్రముఖుడు కమలనాథ్ నిర్మించిన భవనాన్ని కూల్చి వేయాలని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును హైకోర్డు పరిశీలనకు తెచ్చామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com