సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ జరిపేందుకు ఏర్పాటైన ముగ్గురు సభ్యుల అంతర్గత కమిటీ నుంచి జస్టిస్ ఎన్ వి రమణ గురువారం తప్పుకున్నారు. జస్టిస్ రంజన్ గొగోయ్ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ జరపడానికి జస్టిస్ ఎస్ ఏ బొబ్దే , జస్టిస్ ఎన్ వి రమణ, జస్టిస్ ఇందిరా బెనర్జీ కూడిన అంతర్గత కమిటీ ఏర్పాటైన విషయం తెలిసిందే.అంతర్గత కమిటీ శుక్రవారం విచారణ జరపాల్సి వుంది. అయితే జస్టిస్ గొగోయ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సుప్రీమ్ కోర్ట్ మాజీ మహిళా ఉద్యోగిని జస్టిస్ ఎన్ వి. రమణ ను కమిటీ సభ్యులుగా నియమించడం పట్ల అభ్యంతరం చేస్తూ జస్టిస్ బొబ్దే కు రాసినట్లు తెలుస్తోంది. జస్టిస్ ఎన్ వి రమణ జస్టిస్ గొగోయ్ కు సన్నిహితుడని మాజీ మహిళా ఉద్యోగిని ఆరోపించినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా కేవలం ఒకేఒక్క మహిళా జడ్జి ని అంతర్గత కమిటీ లో నియమించడం పట్ల ఆమె అభ్యంతరాన్ని వ్యక్తం చేసారు.దాంతో తన వివరణను జోడిస్తూ అంతర్గత కమిటీ నుంచి తాను స్వయంగా తప్పుకుంటున్నట్లు జస్టిస్ ఎన్ వి రమణ జస్టిస్ బొబ్దే కు లేఖ ద్వారా తెలియజేసారని తెలుస్తోంది. అంతర్గత కమిటీ కి నేతృత్వం వహిస్తున్న జస్టిస్ బొబ్దే కమిటీ లోకి జస్టిస్ ఎన్ వి రమణ, జస్టిస్ ఇందిరా బెనర్జీ లను చేరుకున్నారు. తన తర్వాత సీనియర్ అయినందువల్లే జస్టిస్ ఎన్ వి రమణ ను అంతర్గత కమిటీ లో చేర్చామని జస్టిస్ బొబ్దే ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.