ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగింది. ఆమ్ ఆద్మీ పార్టీతో కాంగ్రెస్ పొత్తుపై ఎట్టకేలకు సందిగ్ధత వీడింది. ఢిల్లీలోని 7 లోక్సభ స్థానాలకు గానూ ఆరు లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ నార్త్ ఈస్ట్ ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనుంది. చాందినీ చౌక్ నియోజకవర్గం నుంచి జేపీ అగర్వాల్, ఈస్ట్ ఢిల్లీ నుంచి అర్విందర్ సింగ్ లవ్లీ, న్యూఢిల్లీ నుంచి అజయ్ మాకెన్, నార్త్ వెస్ట్ ఢిల్లీ నుంచి రాజేశ్ లీలోతియా, వెస్ట్ ఢిల్లీ నియోజకవర్గం నుంచి మహబాల్ మిశ్రా పోటీ చేయనున్నారు. మిగిలిన ఒక్క స్థానానికి త్వరలోనే అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. మాజీ సీఎం షీలా దీక్షిత్పై బీజేపీ తరపున ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ పోటీ చేస్తున్నారు. చాందినీ చౌక్ నుంచి కేంద్ర మంత్రి హర్షవర్ధన్ బరిలో ఉన్నారు. ఢిల్లీలోని ఏడు లోక్ సభ స్థానాలకు ఆరో దశలో మే 12వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. మే 23న ఫలితాలు వెలువడనున్నాయి.