మూడో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో ఆదివారం సాయంత్రం ప్రచారపర్వం ముగిసింది. నాలుగో విడత పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో ప్రచారంపై నేతలు దృష్టిసారించారు. ఇందులో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ...పశ్చిమ బెంగాల్లో బీజేపీ అనుకూల పవనాలు వీస్తున్నట్లు చెప్పారు. మొదటి రెండు విడతల్లో భారీ సంఖ్యలో పోలింగ్ శాతం పెరగడం దీనికి సంకేతమని చెప్పుకొచ్చారు. ఓటమి ఇక తప్పదని తేలిపోవడంతో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ...ఎన్నికల సంఘంపై అసహనం వ్యక్తంచేస్తున్నారని అన్నారు. బీజేపీ నేతల హెలికాప్టర్లు పశ్చిమ బెంగాల్లో ల్యాండింగ్ అయ్యేందుకు కూడా అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించారు. ఎన్నికలను ఈసీ పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తోందని, ఈ విషయంలో ప్రజలకు ఎలాంటి అపోహలు అవసరం లేదన్నారు.
పలు కీలక అంశాలపై విపక్షాలకు స్పష్టమైన విధానమే లేదని అమిత్ షా విమర్శించారు. విపక్షాల ఎన్నికల మేనిఫెస్టోలో దేశ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. నరేంద్ర మోడీ నాయకత్వాన్ని దేశ ప్రజలు అంగీకరించారని చెప్పిన అమిత్ షా...విపక్షాలకు నాయకుడే కరువయ్యాడని ఎద్దేవా చేశారు. ఆర్టికల్ 370, ఉమ్మడి పౌరస్మృతి, తీవ్రవాదం, ఆర్టికల్ 35ఏ తదితర అన్ని అంశాలపైనా బీజేపీకి స్పష్టమైన విధానం ఉందని వ్యాఖ్యానించారు.