న్యూదిల్లీ: జబల్పూర్(మధ్యప్రదేశ్) నుంచి దిల్లీ వెళ్తున్న మహాకోశల్ ఎక్స్ప్రెస్ ఉత్తరప్రదేశ్లోని మహోబా-కుల్పహర్ రైల్వేస్టేషన్ల మధ్య పట్టాలు తప్పింది. గురువారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు ప్రత్యక్ష సాక్షుల సమాచారం. ఈ ఘటనలో మొత్తం 8 బోగీలు పట్టాలు తప్పగా 18 మంది గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని మహోబా జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.పట్టాలు తప్పిన వాటిలో నాలుగు ఏసీ, నాలుగు జనరల్ బోగీలు ఉన్నాయి. ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే రైల్వే అధికారులు సంఘటనాస్థలానికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. బాధితుల సమాచారం కోసం రైల్వే అధికారులు జాన్సీ, గ్వాలియర్, బాంద్రా, నిజాముద్దీన్ స్టేషన్లలో హెల్ప్లైన్ నంబర్లను ఏర్పాటు చేశారు.