ఏడు దశాబ్దాలుగా తమ దేశానికి అనుబంధ ప్రాంతంగా పాక్ తన ఆధీనంలో ఉంచుకున్న గిల్గిట్ – బాల్తిస్తాన్ ప్రాంతానికి రాష్ట్రం (ప్రావిన్స్) హోదా ఇవ్వాలని విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ నేతృత్వంలోని కమిటీ ప్రతిపాదించినట్లు పాక్ అంతర్రాష్ట్ర వ్యవహారాల మంత్రి రియాజ్ హుస్సేన్ పీర్జాదా గత వారంలో ప్రకటించారు. ఆ ప్రాంతపు హోదా మార్చి రాష్ట్రంగా చేయడం కోసం రాజ్యాంగ సవరణ చేపడతామనీ వెల్లడించారు. పాక్లో ప్రస్తుతం బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, పంజాబ్, సింధ్ – నాలుగు రాష్ట్రాలు ఉన్నాయి. ఇప్పుడు కశ్మీర్లో తాము ఆక్రమించుకుని ప్రత్యేక ప్రాంతంగా వ్యవహరిస్తున్న గిల్గిట్ – బాల్తిస్తాన్ను ఐదో రాష్ట్రంగా కలుపుకునేందుకు చర్యలు చేపట్టింది గిల్గిట్ – బాల్తిస్తాన్ను పాకిస్తాన్ కలిపివేసుకునే ప్రయత్నాలకు.. కశ్మీర్ వేర్పాటువాద సంస్థ హురియత్ కాన్ఫరెన్స్ తీవ్రంగా తప్పుపట్టింది. ఈ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు పాక్ సర్కారుకు తెలిపింది. పాక్ చర్యలను నిరసిస్తూ పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారీ నిరసన ప్రదర్శనలు చేపడతామని హెచ్చరించింది. ఆ ప్రాంతాన్ని పాక్ కలిపివేసుకున్నట్లయితే కశ్మీర్ సమస్య పరిష్కార ప్రయత్నాలు బలహీనపడతాయని ఆందోళన వ్యక్తంచేసింది. ఈ చర్య కశ్మీరీ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని డెమొక్రటిక్ ఫ్రీడమ్ పార్టీ అభివర్ణించింది. ఇక పాక్ ఆక్రమిత కశ్మీర్లో గత వారం చాలా మంది కార్యకర్తలు, ముఖ్యంగా న్యాయవాదులు వీధుల్లోకి వచ్చి పాక్ ప్రయత్నాలకు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ప్రదర్శణలు నిర్వహించారు. ‘మా పిల్లలు చనిపోయినా సరే.. గిల్గిట్ను కలుపుకోనివ్వం’ అంటూ నినాదాలు చేశారు. జమ్మూకశ్మీర్ ప్రాంతాలన్నీ అవిభాజ్యమైనవని, వాటన్నిటినీ యధాపూర్వం కలిపేసి స్వాతంత్ర్యం కావాలని వారి డిమాండ్.