ప్రజా శాంతి పార్టీ ఇప్పుడు వైసీపీకి చిక్కుముడిలా తయారైంది. తమ ఎన్నికల గుర్తుతో పాటు.. పార్టీ అభ్యర్థుల్ని సైతం సమాంతరంగా తయారు చేస్తూ పంటికింద రాయిలా తయారైయ్యేందుకు సిద్ధమైంది.ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రజా శాంతి పార్టీ గుర్తు వల్ల తమకు నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తోన్న వైసీపీ, ఈ విషయమై కేంద్ర ఎన్నికల సంఘానికి సైతం ఫిర్యాదు చేసింది. తమ అభ్యర్థి పేర్లతో సరి పోలిన వారితోనే నామినేషన్లు వేయించిన పాల్, వైసీపీను మరింత కలవరపాటుకు గురిచేస్తున్నారు.పర్చూరులో వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు నామినేషన్ దాఖలు చేయగా, అక్కడ అదే పేరు గల వ్యక్తి ప్రజా శాంతి పార్టీ తరఫున నామినేషన్ వేశారు.
అనంతపురం అర్బన్లో వైసీపీ అభ్యర్థిగా అనంత వెంకటరామిరెడ్డి బరిలో ఉండగా, ప్రజా శాంతి పార్టీ నుంచి పగిడి వెంకరామిరెడ్డిని నిలబెట్టారు. అనంతపురం జిల్లాలోని ఎనిమిది చోట్ల వైసీపీ అభ్యర్థుల పేర్లను పోలిన వారితోనే పాల్ నామినేషన్ వేయించారు. ఇక్కడ రాయదుర్గం నియోజకవర్గంలో వైసీపీ నుంచి కాపు రామచంద్రారెడ్డి పోటీ చేస్తుండగా, ప్రజాశాంతి పార్టీ తరఫున ఉండాల రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
కల్యాణదుర్గంలో వైసీపీ అభ్యర్థిగా ఉషా శ్రీచరణ్, ప్రజా శాంతి నుంచి ఉషారాణి నామినేషన్ వేశారు. రాప్తాడు నుంచి వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, ప్రజాశాంతి నుంచి డీ ప్రతాప్ బరిలో ఉన్నారు. పెనుగొండలో ఎం శంకర్ నారాయణ వైసీపీ, ఎస్ శంకర్ నారాయణ ప్రజా శాంతి పార్టీ, ధర్మవరంలో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వైసీపీ నుంచి పోటీ చేస్తుండగా, ప్రజాశాంతి తరఫున పెద్దిరెడ్డిగారి వెంకటరామిరెడ్డి నామినేషన్ వేశారు.
ఉరవకొండలో వైసీపీ తరఫున విశ్వేశ్వర్ రెడ్డి పోటీ చేస్తుంటే, విశ్వనాథ్ రెడ్డి అనే వ్యక్తి పాల్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం విశేషం. దీని వెనుక చంద్రబాబు కుట్ర ఉందని వైసీపీ ఆరోపిస్తోంది. చంద్రబాబు డైరెక్షన్లోనే కేపే పాల్ నడుస్తున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఓటర్లను గందరగోళానికి గురిచేసి తమ అభ్యర్థుల విజయవకాశాలను దెబ్బకొట్టడానికే ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని అరోపిస్తున్నారు. ఈవీఎంలలో ఇంగ్లీషు పదాలను అనుసరించి పేరులోని తొలి అక్షరం ప్రకారం గుర్తులు కేటాయిస్తారు కాబట్టి ఓటర్లను అయోమయంలో పడేయడానికి ఇలాంటి కుట్రలు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఫ్యాన్ గుర్తుకు కింద లేదా పైన హెలికాప్టర్ ఉండేలా చూస్తున్నారని, దీంతో నిరక్షరాస్యులైన ఓటర్లు పొరబడే ప్రమాదం ఉందని అంటున్నారు.