దిల్లీ: 2019 ప్రపంచకప్ ఆడతానని భారత క్రికెట్ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ స్పష్టం చేశారు. దేశ రాజధాని దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ధోనీ మాట్లాడుతూ... 2019నాటికి ఫిట్గా ఉండే తప్పకుండా ప్రపంచ కప్నకు అందుబాటులో ఉంటానని ప్రకటించారు.వన్డే, టీ20 ఫార్మాట్ల సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొన్న ధోనీ త్వరలో రిటైర్మెంట్ ప్రకటిస్తాడని గతంలో వార్తలు వచ్చాయి. దీనికి తోడు అతని చిన్ననాటి కోచ్ కేశవ్ బెనర్జీ కూడా ఛాంపియన్స్ ట్రోఫీకి కొంత సమయం ఉంది. త్వరలో తలరాతలు తెలుస్తాయి అని అనడంతో ధోనీ రిటైర్మెంట్పై అనుమానం మరింత బలపడింది. ధోనీ తాజాగా చేసిన ప్రకటనతో ఆ అవన్నీ పటాపంచలయ్యాయి. ఇప్పుడిప్పుడే క్రికెట్కి దూరమవ్వాలన్న ఆలోచనలో లేనని కూడా ధోనీ తెలిపాడు. గురువారం దిల్లీలో జరిగిన ఓ ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్న ధోనీని అభిమానులు 2019ప్రపంచ కప్లో పాల్గొంటారా అన్న ప్రశ్న సంధించారు. దీనికి ఆయన స్పందిస్తూ ప్రస్తుతం చాలా ఫిట్గా ఉన్నాను. ఎలాంటి ఫిట్నెస్ సమస్య లేకపోతే ప్రపంచకప్ ఆడేందుకు అందుబాటులో ఉంటాను అని తెలిపారు. 100శాతం అందుబాటులోనే ఉంటారా అన్న మరో ప్రశ్నకు.. 100శాతం ఎవరూ చెప్పలేరు. ఇప్పుడు మనం 2017లో ఉన్నాం. ప్రపంచకప్నకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. ఈ రెండేళ్లలో ఏమైనా జరగవచ్చు. 10ఏళ్లుగా భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాను. టీమిండియా షెడ్యూల్ గురించి నాకు తెలుసు, చాలా బిజీగా ఉంటుంది. జట్టు ఎంపికలో సెలక్టర్లు కీలకపాత్ర పోషిస్తారు. పాతకాలం క్రికెటర్లను ఎంపిక చేసే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు అని ధోనీ తెలిపాడు.