దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం గుజరాత్, రాజస్థాన్ రాష్ట్ర ఎంపీలతో భేటీ అయ్యారు. ప్రధాని నివాసంలో దాదాపు 50 మంది ఎంపీలతో మోదీ సమావేశమయ్యారు. ఈ ఏడాది డిసెంబర్లో గుజరాత్లో జరగనున్న ఎన్నికలపై ఎంపీలతో చర్చించినట్లు సమాచారం. యూపీలో అఖండ విజయం సాధించి, ప్రభుత్వం ఏర్పాటు చేసిన భాజపా.. మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్లో కూడా విజయ బావుటా ఎగరేసే దిశగా వెళ్లాలని వ్యూహాలు రచిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. భాజపా సీనియర్ నేత ఎల్కే అడ్వాణీ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, భాజపా జాతీయధ్యక్షుడు అమిత్షా తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. దాదాపు 19ఏళ్లుగా గుజరాత్ని పాలిస్తున్న భాజపాకి మొత్తం 182 అసెంబ్లీ సీట్లకు గానూ ప్రస్తుతం 123 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అయితే ఈ సారి జరిగే ఎన్నికల్లో దాదాపు 150 సీట్లను గెలవాలనే వ్యూహంతో భాజపా ముందుకు వెళ్తొంది. అయితే భాజపాను ఓడించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ తీవ్ర ప్రయత్నాలు ప్రారంభించారు. ఆయన ఇప్పటికే గుజరాత్లో ప్రచారం ప్రారంభించారు.