రాష్ట్రంలో జర్నలిస్టుల గృహనిర్మాణ కార్యక్రమానికి ఫిబ్రవరి 20న అనంతపురం జిల్లాతో శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్ర చరిత్రలో జర్నలిస్టుల గృహనిర్మాణంకోసం ప్రత్యేకంగా, ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా అర్హులైన జర్నలిస్టులందరికీ శాశ్వత గృహవసతి కల్పించేందుకు సమాచారశాఖ చర్యలు చేపడుతోంది. రాష్ట్ర సమాచార పౌరసంబంధాలు, గ్రామీణ గృహనిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు ప్రాతినిధ్యం వహిస్తున్న రాయదుర్గం నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంబిస్తున్నారు. ఆరోజున నియోజకవర్గ పరిధిలోని 45 మంది జర్నలిస్టులకు నియోజకవర్గ కేంద్రం రాయదుర్గం పట్టణంలో ఇళ్ల నిర్మాణానికి గృహాల మంజూరు పత్రాలు అందించడం ద్వారా ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. దీనితోపాటు ఇప్పటికే గృహనిర్మాణ పథకాల కింద ఇళ్లు మంజూరై గృహాలు నిర్మించుకుంటున్న జర్నలిస్టులకు సమాచార శాఖ ద్వారా ఇళ్ల నిర్మాణానికి ఇచ్చే అదనపు ప్రోత్సాహాక మొత్తాన్ని కూడా అందజేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 10వేల మంది జర్నలిస్టులు గృహనిర్మాణ పథకానికి దరఖాస్తు చేశారు. సొంతంగా లేదా ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాలు కలిగి వున్న దాదాపు వెయ్యి మంది జర్నలిస్టులకు ఇప్పటికే గృహనిర్మాణ సంస్థ మంజూరు ఉత్తర్వులను సిద్ధం చేసి అందజేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. దీనితోపాటు ఇప్పటికే ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం, ఇతర ప్రభుత్వ పథకాల కింద గృహాలు మంజూరు అయిన 1901 మంది జర్నలిస్టులకు సమాచార శాఖ ద్వారా అందించే అదనపు పారితోషికాన్ని అందజేసేందుకు కూడా సమాచారశాఖ ఏర్పాట్లు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.00 లక్ష, పట్టణాల్లో గృహాలు నిర్మించుకొనే వారికి రూ.1.50 లక్షల వంతున మంజూరు చేసేందుకు వీలుగా రూ.22.22 కోట్లను రాష్ట్ర గృహనిర్మాణ సంస్థకు సమాచార శాఖ విడుదల చేసింది. ఈ మొత్తానికి సంబంధించిన పత్రాలను కూడా మంత్రి కాలవ శ్రీనివాసులు అందజేయనున్నారు. సమాచార శాఖ కమిషనర్ ఎస్.వెంకటేశ్వర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.