పుల్వామా ఉగ్రవాద దాడిపై భారత్, పాకిస్తాన్ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. దాడిలో చనిపోయిన జవాన్లకు భారతావని నివాళి అర్పిస్తోంది. అయితే ఈ దాడి కాస్తా రాజకీయ రంగు పులుముకోవడంతో వివాదాలు మొదలయ్యాయి. దాడిని ఖండించని వాళ్లు, కశ్మీరీలకు మద్దతు పలికే వాళ్లు దేశద్రోహులని సోషల్ మీడియాలో తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు.
భారత సైన్యాన్ని తిడుతూ, కశ్మీర్ ఉద్యమానికి మద్దతు పలికే దేశద్రోహుల పని పడతామంటూ ఫేస్బుక్లో ‘క్లీన్ ద నేషన్’ పేరుతో కొందరు గ్రూపు ఏర్పాటు చేశారు. ఇందులో బీజేపీ, ఆరెస్సెస్ తదితర హిందూ సంస్థల కార్యకర్తలు చురుగ్గా పనిచేశారు. వీరి పని.. ‘దేశద్రోహుల’ను గుర్తించి వారిని ఇబ్బంది పెట్టడం. వారు చదువులున్న కాలేజీలకు, వారు పని చేసే ఆఫీసులకు ఫిర్యాదులు పంపి, ఉద్యోగాలు ఉడగొట్టడం. ఇదంతా వారే స్వయంగా చెప్పుకున్నారు. భారత సైన్యానికి వ్యతిరేకంగా, కశ్మీరీలకు, ముఖ్యంగా ఆజాదీ కశ్మీరీలకు మద్దతుగా పోస్టులు పెట్టే వారిని గుర్తిస్తున్నామని చెప్పుకున్నారు. ప్పటికే తాము 50 మంది ఉద్యోగాలను ఊడగొట్టామని చెప్పారు. ‘ఒక గొర్రె బలైంది..’ అని అప్ డేట్స్ ఇచ్చారు. తామేం చేశామో చెప్పే స్క్రీన్ షాట్లను పోస్ట్ చేశారు. మాధుర్ జుక్ సింగ్ ఈ గ్రూపును ప్రారంభించాడు.
‘డీపీ(డిస్ ప్లే పిక్చర్లు)లు మార్చుకుని, కొవ్వొత్తుల ర్యాలీలు తీసే సమయం కాదు. మన సైనికులను చూసి నవ్వేవాళ్లను, వారి త్యాగాలను వేడుక చేసుకునేవాళ్లు గుర్తించండి. వాళ్ల యాజమాన్యాలకు సమాచారం ఇవ్వండి. యూనివర్సిటీలకు చెప్పండి. .ఈమెయిల్స్ పంపండి… ఉద్యోగాలు ఊడగొట్టండి, కాలేజీల నుంచి పంపేయండి.. ’ అని కోరాడు. పుల్వాల ఎన్కౌంటర్ తర్వాత పిడికెడు మందితో ప్రారంభమైన ఈ గ్రూపులో సోమవారం నాటికి 6వేలమంది ఉన్నారు. అయితే ఏమైందో ఏమోగాని ఫేస్బుక్ ఈ పేజీని తొలగించింది. తమకు ఎలాంటి సమాచారమూ ఇవ్వకుండానే ఈ నిర్ణయం తీసుకుందని గ్రూపు సభ్యులు వాపోతున్నారు.