ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్డీఏ నేతలు మాకు టచ్‌లో ఉన్నారు.. మోదీ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు: రాహుల్ గాంధీ

national |  Suryaa Desk  | Published : Tue, Jun 18, 2024, 09:34 PM

కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ఏర్పడిన ఎన్డీఏ కూటమి సంకీర్ణ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశంలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఎన్డీఏ కూటమిలోని నేతలు కొందరు కాంగ్రెస్ పార్టీతో టచ్‌లో ఉన్నారని.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఉద్దేశించి రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన రాహుల్ గాంధీ.. నరేంద్ర మోదీ సర్కార్‌పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలో కూటమిలో తీవ్ర అసంతృప్తి నెలకొందని పేర్కొన్నారు.


కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి నేతలు కొందరు తమకు టచ్‌లోనే ఉన్నారని చెప్పిన రాహుల్‌ గాంధీ.. అయితే వాటికి సంబంధించి మరిన్ని వివరాలు మాత్రం చెప్పలేదు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి భవిష్యత్ మనుగడ కోసం తీవ్రంగా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నట్లు రాహుల్ గాంధీ అంచనా వేశారు. ఎన్డీఏ కూటమి బలహీనంగా ఉండటంతో ఏ చిన్న సమస్య తలెత్తినా అది నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని కూల్చేయవచ్చని సంచలనం సృష్టించే వ్యాఖ్యలు చేశారు.


ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల సమయంలోనే నరేంద్ర మోదీ చేసిన ప్రసంగాలను ఉద్దేశించి రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ, నరేంద్ర మోదీ విద్వేషాన్ని వ్యాప్తి చేసి.. వాటి ద్వారా ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని పొంది ఉండవచ్చని.. అయితే ఈసారి ఆ ఆలోచనను ప్రజలు తిరస్కరించారని పేర్కొన్నారు. ఎలాంటి వివక్ష లేని పరిస్థితులు ఉంటే.. విపక్ష ఇండియా కూటమి ఎలాంటి సందేహం లేకుండా ఈ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను దక్కించుకుని ఉండేదని రాహుల్ గాంధీ చెప్పారు. తమ చేతులు కట్టేసిన పరిస్థితుల్లో కూడా ఇండియా కూటమి పోరాటం చేసిందని.. అలాంటి సమయాల్లో ప్రజలకు ఏం చేయాలో కచ్చితంగా తెలుసని అన్నారు.


గత 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మెజార్టీ సాధించింది. కానీ ఈసారి మాత్రం 240 సీట్లు మాత్రమే సాధించి.. మెజార్టీ మార్కుకు దూరంగా ఆగిపోయింది. దాంతో ఎన్డీఏ కూటమిలోని ఇతర పార్టీలపై ఆధారపడక తప్పలేదు. మరోవైపు కాంగ్రెస్ గతంతో పోలిస్తే మెరుగైన ప్రదర్శన చేసి ఈసారి 99 సీట్లలో విజయం సాధించింది. ఇండియా కూటమి పార్టీలకు 230కి పైగా సీట్లు వచ్చాయి. ఈ క్రమంలోనే మోదీ ప్రభుత్వం కూలిపోతుందని రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com