ఇటీవల కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రధానమంత్రితోపాటు మరో 71 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలోనే భోజ్పురి నటి నిషా దూబే కీలక విషయాన్ని వెల్లడించింది. తాను ఓ కేంద్రమంత్రిని ప్రేమిస్తున్నట్లు చెప్పేసింది. ఇన్స్టాగ్రామ్లో వీడియో విడుదల చేసిన నిషా దూబే తన ప్రేమ విషయాన్ని వెల్లడించింది. కేంద్రమంత్రి, లోక్జన శక్తి పార్టీ (రామ్ విలాస్) అధినేత చిరాగ్ పాశ్వాన్పై తాను మనసు పారేసుకున్నట్లు తాజాగా తెలిపింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన తర్వాత.. చిరాగ్ పాశ్వాన్ పేరు దేశ రాజకీయాల్లో మారుమోగిపోతోంది. అయితే ఇప్పటికే చిరాగ్ పాశ్వాన్ అంటే చాలా మంది యువతులు ఇష్టపడుతుండగా.. తాజాగా ఆ జాబితాలోకి నిషా దూబే చేరిపోయింది.
ఈ క్రమంలోనే చిరాగ్ పాశ్వాన్ను ప్రేమిస్తున్నానంటూ నిషా దూబే ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించింది. అయితే నిషా దూబే వయసు 25 ఏళ్లు కాగా.. చిరాగ్ పాశ్వాన్ వయసు 41 ఏళ్లు. తనకంటే 16 ఏళ్లు పెద్ద అయిన చిరాగ్ పాశ్వాన్ను ప్రేమిస్తున్నట్లు నిషా దూబే తెలిపింది. ఈ క్రమంలోనే ఇటీవల కేంద్రమంత్రిగా చిరాగ్ పాశ్వాన్ ప్రమాణ స్వీకారం చేస్తున్న వీడియో క్లిప్ను నిషా దూబే తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. అంతేకాకుండా ఆ వీడియో బ్యాక్గ్రౌండ్లో నవాజుద్దీన్ సిద్దిఖీ డైలాగ్ వచ్చేలా ఎడిట్ చేసింది. ఒక మహిళ ఏమైనా కోరుకోవచ్చు అంటూ నవాజుద్దీన్ సిద్దిఖీ అంటున్నట్లుగా ఉన్న వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో చిరాగ్ పాశ్వాన్కు సంబంధించిన వీడియోలను కలిపింది. నిత్యం నవ్వుతూ ఉండే చిరాగ్ పాశ్వాన్ అమాయకత్వపు ముఖం చేస్తే.. ఎవరైనా మనసు పారేసుకుంటారని.. తన విషయంలో కూడా అదే జరిగిందని క్యాప్షన్ ఇచ్చింది.
బిహార్లో లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) అధినేత చిరాగ్ పాశ్వాన్ ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2024 లోక్సభ ఎన్నికల్లో హాజీపూర్ నియోజకవర్గం నుంచి 6.14 లక్షల ఓట్ల భారీ మెజార్టీతో చిరాగ్ పాశ్వాన్ విజయం సాధించారు. తన తండ్రి, దివంగత రామ్విలాస్ పాశ్వాన్ వారసుడిగా చిరాగ్ పాశ్వాన్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. చిరాగ్ పాశ్వాన్కు సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ ఉంటుంది. 41 ఏళ్ల చిరాగ్ పాశ్వాన్.. 2011లో ఓ హిందీ సినిమాలో హీరోగా నటించారు. అందులో హీరోయిన్ బీజేపీ తరఫున తొలిసారి ఎంపీగా గెలిచిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కావడం గమనార్హం. ఇక ఈ ఎన్నికల్లో 5 ఎంపీ స్థానాలు గెలిచిన చిరాగ్ పాశ్వాన్ పార్టీ.. ఎన్డీఏ కూటమిలో బీజేపీ, టీడీపీ, జేడీయూ, షిండే శివసేన పార్టీల తర్వాతి స్థానంలో నిలిచింది.