ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘రీల్స్’ పిచ్చికి పరాకాష్ట.. కొండపై నుంచి కారు పడి, యువతి దుర్మరణం

national |  Suryaa Desk  | Published : Tue, Jun 18, 2024, 09:35 PM

రీల్స్ పిచ్చికి పరాకాష్ట ఈ ఘటన. ఫ్రెండ్స్‌తో కలిసి ఆలయానికి వచ్చిన యువతి, రీల్స్ పిచ్చితో గుడి ప్రాంగణంలోనే ప్రాణాలు కోల్పోయిన విషాదమిది. కొండపై కారు నడపడమే కాకుండా, రీల్స్ కోసం రివర్స్ తీస్తూ.. కొండ పైనుంచి కారుతో పాటు లోయలోకి పడిపోయింది. ఇంతకీ ఆ యువతికి కారు డ్రైవింగే రాకపోవడం శోచనీయం. బ్రేక్‌కు బదులుగా యాగ్జిలరేటర్ తొక్కడంతో కారు నేరుగా వెనక్కి వెళ్లిపోయి లోయలో పడిపోయింది. కళ్ల ముందే జరిగిన దుర్ఘటనను చూసి అక్కడున్న వారందరూ హతాశులయ్యారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ (ఛత్రపతి శంభాజీనగర్)లో సోమవారం (జూన్ 17) మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.


 సెల్ ఫోన్లో వీడియో చిత్రీకరిస్తున్న యువతి స్నేహితుడు ‘బ్రేక్.. బ్రేక్.. బ్రేక్’ అంటూ కారు వైపు పరుగెత్తుకొచ్చాడు. కానీ, పరిస్థితి అప్పటికే చేజారిపోయింది. ఎత్తైన కొండ పైనుంచి కిందపడటంతో కారు తీవ్రంగా ధ్వంసమై, యువతి అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..


ఔరంగాబాద్ పట్టణం హనుమాన్ నగర్‌లో నివాసం ఉంటున్న సూరజ్ (25) తన స్నేహితురాలు శ్వేతా సుర్వసేతో కలిసి సోమవారం మధ్యాహ్నం టొయొటా కారులో ఖుల్తాబాద్ తాలూకా సులిభంజన్‌లోని దత్త మందిర్ ఆలయ సందర్శనకు వచ్చారు. దేవుడి దర్శనం అనంతరం ఆలయ పరిసరాల్లో తిరుగుతూ వీడియోలు తీసుకున్నారు. ఆ తర్వాత శ్వేత కారు నడపాలనే తన కోరికను వ్యక్తం చేసింది. కారు నడుపుతూ రీల్స్ తీయించుకుందామని భావించింది.


కొండపై కారు నడిపే కోరికను వారించాల్సిందిపోయి, శ్వేత ఉత్సాహాన్ని స్నేహితుడు సూరజ్ ఎంకరేజ్ చేశాడు. కారు డ్రైవింగ్ చేయడం తెలియని యువతి చేతికి స్టీరింగ్ అప్పగించాడు. ఆమెకు వాహనాన్ని అప్పగించి తాను వీడియో (రీల్) రికార్డు చేసే పనిలో నిమగ్నమయ్యాడు. సూరజ్ సూచనల ప్రకారం కారు స్టార్ట్ చేసిన యువతి.. వాహనాన్ని వెనక్కి పోనిస్తూ వీడియో కోసం పోజులిచ్చింది. కానీ, ఆ ఆనందం క్షణాల్లో ఆవిరైపోయింది.


ఈ భయానక ఘటనను ప్రత్యక్షంగా చూసిన కొంత మంది భక్తులు.. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఖుల్తాబాద్ పోలీసులు.. స్థానికుల సాయంతో శ్వేతను కారులో నుంచి బయటకు తీశారు. ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.


ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనలో తప్పు యువతిదా? అతడి స్నేహితుడిదా? అనే చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం యువత చేస్తున్న వెర్రి చేష్టలు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.


తండ్రిని బలి తీసుకున్న కుమార్తె సెల్ఫీ


రిజర్వాయర్ వద్ద సెల్ఫీ తీసుకోవాలనే ఓ అమ్మాయి కోరిక ఆమె కన్నతండ్రిని బలి తీసుకున్న విషాద ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. కరీంనగర్ పట్టణానికి చెందిన విజయ్ కుమార్ (47) సోమవారం బక్రీద్ సెలవు రోజు కావడంతో భార్య, పిల్లలు సాయినిత్య, విక్రాంత్‌తో కలిసి సమీపంలోని ఆలయానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కాసేపు సరదాగా గడిపేందుకు ఎల్ఏండీ రిజర్వాయర్ వద్దకు వచ్చారు. రిజర్వాయర్ వద్ద సెల్ఫీ తీసుకునే క్రమంలో సాయినిత్య ప్రమాదవశాత్తూ కాలు జారీ నీటిలో పడిపోయింది. ఆమెను కాపాడేందుకు తండ్రి విజయ్, అన్నయ్య విక్రాంత్ నీటిలోకి దూకారు.


కళ్ల ముందే ముగ్గురూ నీటిలో మునిగిపోవటం చూసి ఒడ్డునే ఉన్న విజయ్ భార్య గట్టిగా కేకలు వేశారు. సమీపంలోనే ఉన్న మత్స్యకారుడు శంకర్.. సాహసం చేసి నీటిలో దూకాడు. సాయినిత్య, విక్రాంత్‌‌ను కాపాడి ఒడ్డుకు తీసుకొచ్చాడు. విజయ్ కుమార్ మాత్రం నీటిలో మునిగిపోయి కాసేపటి తర్వాత శవమై తేలాడు. కళ్ల ముందే భర్తను కోల్పోయి ఆయన భార్య రోదించిన తీరు అక్కడున్న వారందరినీ కలచివేసింది. రీల్స్, సెల్ఫీల పిచ్చి ఎంతటి విషాదాలకు దారితీస్తున్నాయో చూశారా..!






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com