కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. ఇక ప్రధానమంత్రిగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలోనే రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా తాజాగా రైతులకు డబ్బులు విడుదల చేశారు. తన సొంత నియోజకవర్గం అయిన ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఈ సందర్భంగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ.. రైతుల గురించి ప్రస్తావించారు.
రైతులకు వ్యవసాయంలో పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పీఎం కిసాన్ సమ్మాన్నిధి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. 2018 నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. దీనికింద అర్హులైన రైతులకు ప్రతీ సంవత్సరం మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున మొత్తం రూ.6 వేలు పెట్టుబడి సాయంగా అందిస్తున్నారు. ఈ క్రమంలోనే వారణాసిలో ‘పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్’ కార్యక్రమంలో రైతుల ఖాతాల్లో డబ్బులు వేశారు. దీంతో దాదాపు 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2 వేలు చొప్పున ఏకంగా రూ.20 వేల కోట్లు జమ చేయనున్నారు. మరోవైపు.. లోక్సభ ఎన్నికల్లో వారణాసిలో గెలుపొందడం, మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వారణాసిలో నరేంద్ర మోదీ పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద 17 వ విడత నిధులను ఇవాళ నరేంద్ర మోదీ వారణాసిలో విడుదల చేశారు. 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.20 వేల కోట్లు జమ చేశారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు కోట్లాది మంది రైతుల బ్యాంకు ఖాతాలకు రూ. 3.24 లక్షల కోట్లు జమ చేశారని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. మరోవైపు.. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఉత్తర్ప్రదేశ్ దేశంలోనే వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా ముందుకు సాగుతుందని ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ తెలిపారు. ప్రపంచంలో భారత్కు ప్రధాని మోదీ సరికొత్త గుర్తింపును తీసుకువచ్చారని ప్రశంసలు గుప్పించారు.