దేశంలో గత కొన్ని నెలలుగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఇప్పుడు ఎన్నికల ఫలితాలు వెలువడి మళ్లీ కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు ఆగిపోయిన పథకాలు, కార్యక్రమాలు మళ్లీ అమలు చేస్తున్నారు. తాజాగా మంగళవారం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి సాయం కింద 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో ఒక్కొక్కరికీ రూ.2 వేల చొప్పున మొత్తం రూ.20 కోట్ల నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. వారణాసిలో నిర్వహించిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ క్రమంలోనే ఎన్నికల కారణంగా వాయిదా పడిన మన్ కీ బాత్ కార్యక్రమాన్ని కూడా ప్రసారం చేయనున్నట్లు తాజాగా కేంద్రం తెలిపింది.
ఈ నెల 30 వ తేదీ నుంచి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మళ్లీ ప్రారంభించనున్నట్లు మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా వెల్లడించారు. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రతీ నెల చివరి ఆదివారం ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రసారం చేస్తారు. ఇప్పటివరకు 110 ఎపిసోడ్లు పూర్తి కాగా.. జూన్ 30 వ తేదీన 111 వ ఎపిసోడ్తో మన్ కీ బాత్ కార్యక్రమం మళ్లీ ప్రసారం అవుతుందని మోదీ చెప్పారు. ఈ సందర్భంగా మన్ కీ బాత్ కార్యక్రమం కోసం ఆలోచనలు, సూచనలు తమకు తెలియజేయాలని ఈ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని పిలుపునిచ్చారు
దేశంలో సార్వత్రిక ఎన్నికల కారణంగా కొన్ని నెలల పాటు మన్ కీ బాత్ కార్యక్రమానికి విరామం ఇచ్చారు. ఇక ఈ మన్ కీ బాత్ కార్యక్రమం మళ్లీ ప్రసారం కానుందని చెప్పడం సంతోషంగా ఉందని మోదీ ట్విటర్ వేదికగా వెల్లడించారు. జూన్ 30 న తేదీన 111 వ ఎపిసోడ్ ప్రసారం కానుందని.. దానికి సంబంధించిన ఆలోచనలు, సూచనలను పంచుకోవాలని పిలుపునిస్తున్నట్లు తెలిపారు. MyGov ఓపెన్ ఫోరమ్, NaMo యాప్ లేదా 1800 11 7800 ఫోన్ నంబర్ ద్వారా దేశ ప్రజలు తమ అభిప్రాయాలను పంచుకోవాలని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
ప్రతి నెల చివరి ఆదివారం రోజున ప్రసారం అయ్యే ‘మన్ కీ బాత్’ కార్యక్రమం ఎన్నికలకు ముందు 110వ ఎపిసోడ్ చివరిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరి 25 వ తేదీన ప్రసారం అయింది. ఆ ఎపిసోడ్లో మాట్లాడిన ప్రధాని మోదీ.. దేశంలో తొలిసారి ఓటు హక్కు పొందిన యువతీ యువకులు ఈ లోక్సభ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఎన్నికల తర్వాత ప్రసాకం అయ్యే ఎపిసోడ్ను ఉద్దేశిస్తూ.. 111 సంఖ్యకు ఎంతో విశిష్టత ఉందని పేర్కొన్నారు. ఆ తర్వాత ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఈ మన్ కీ బాత్ కార్యక్రమం 3 నెలలకుపైగా వాయిదా పడింది. ఇక ఇప్పుడు మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ చేయనున్న మన్ కీ బాత్.. తొలి ప్రసంగంలో ఏం మాట్లాడనున్నారు అనే అంశం ప్రస్తుతం దేశ ప్రజల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.