ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరిన్ని చిక్కుల్లో కన్నడ నటుడు దర్శన్‌.. మేనేజర్ ఆత్మహత్య

national |  Suryaa Desk  | Published : Tue, Jun 18, 2024, 09:31 PM

రేణుకాస్వామి అనే అభిమానిని హత్య చేసినట్లు కన్నడ నటుడు దర్శన్‌పై ఆరోపణలు రావడం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. నటి పవిత్ర గౌడకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపించినందుకే రేణుకాస్వామిని నటుడు దర్శన్ చంపారనే ఆరోపణలతో ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు.. జైలుకు తరలించారు. ఈ క్రమంలోనే తాజాగా దర్శన్ మేనేజర్ శ్రీధర్ బలవన్మరణానికి పాల్పడటం మరింత సంచలనంగా మారింది. దర్శన్‌కు చెందిన బెంగళూరులోని ఫామ్‌హౌస్‌లోనే మంగళవారం శ్రీధర్ ఆత్మహత్య చేసుకోవడం ప్రస్తుతం దర్శన్ కేసులో మరో కీలక మలుపుగా మారింది. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన పోలీసులు.. శ్రీధర్ ఆత్మహత్య ఘటనపై కూడా దర్యాప్తు ప్రారంభించారు.


బెంగళూరులోని దర్శన్ ఫామ్‌హౌస్‌లో శ్రీధర్ ఆత్మహత్య జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలోనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. శ్రీధర్ మృతదేహంతో పాటు సంఘటనా స్థలంలో ఒక సూసైడ్‌నోట్‌, ఒక వీడియో సందేశాన్ని గుర్తించి.. వాటిని స్వాధీనం చేసుకున్నారు. అయితే తన చావుకు ఎవరూ కారణం కాదని.. ఆ సూసైట్ లెటర్, వీడియోలో.. శ్రీధర్ పేర్కొనడం గమనార్హం. తాను ఒంటరిగా ఉన్నానని.. ఒంటరితనం వేధించడం వల్లే చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు మరణ వాంగ్మూలంలో శ్రీధర్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే శ్రీధర్ ఆత్మహత్య ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ అరెస్ట్ అయిన నేపథ్యంలో ఆయన మేనేజర్ శ్రీధర్ ఆత్మహత్య చేసుకోవడం మరింత సంచలనంగా మారింది.


నటి పవిత్రా గౌడ, నటుడు దర్శన్‌ పదేళ్లుగా లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే దర్శన్‌కు అంతకుముందే విజయలక్ష్మి అనే మహిళతో వివాహం జరిగింది. ఈ క్రమంలోనే దర్శన్‌కు, ఆయన భార్యకు, పవిత్రా గౌడకు మధ్య గొడవలు జరుగుతున్నట్లు కూడా వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే తన అభిమాన హీరో దర్శన్ వ్యక్తిగత జీవితంలో పవిత్ర గౌడ కారణంగా గొడవలు జరుగుతున్నాయని భావించిన దర్శన్‌ అభిమాని, చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి అనే 28 ఏళ్ల యువకుడు తీవ్ర ఆగ్రహం చెందాడు.


ఈ క్రమంలోనే పవిత్రా గౌడ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌కు తరచూ అశ్లీల మెసేజ్‌లు పంపేవాడు. అంతేకాకుండా ఎప్పుడూ ఆమెను తిడుతూ ఉండేవాడు. ఈ క్రమంలోనే రేణుకాస్వామి హత్యకు గురి కావడం పెను సంచలనంగా మారింది. రేణుకాస్వామి హత్య ఘటనను సీరియస్‌గా తీసుకున్న కర్ణాటక పోలీసులు.. విచారణ చేపట్టి ఈ కేసులో దర్శన్, పవిత్ర గౌడ సహా మొత్తం 15 మందిని ఇప్పటివరకు అరెస్ట్ చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com