జేఎస్ఎల్ కర్మాగారం యాజమాన్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. జింధాల్ నగర్లో నున్న జేఎస్ఎల్ కర్మాగారానికి యాజమాన్యం అక్రమ లాకౌట్ విధించడంపె మూడు కార్మికసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ మేరకు కార్మిక జేఏసీ ప్రతినిధులు, కార్మికులు శుక్రవారం జేఎస్ఎల్ కర్మాగారం మెయిన్ గేట్ నుంచి కొత్తవలస జంక్షన్వరకు పాద యాత్ర చేశారు. అనంతరం కొత్తవలస జంక్షన్లో రాస్తారోకో, మానవహారాన్ని నిర్వహించారు. దీంతో కొత్తవలస జంక్షన్లో ట్రాఫిక్ స్తంభించింది. తమ సమస్యను అధికారులు దృష్టికి తీసుకెళ్లడం కోసమే మానవహారం చేసినట్టు కార్మికులు తెలిపారు జేఏసీ నాయకులు నెక్కలనాయుడుబబాబు, పిల్లా అప్పలరాజు, గాడి అప్పారావుతో పాటు రాష్ట్రఫెర్రోక్రోమ్ పరిశ్రమల కార్మిక సంఘాల నాయకుడు టీవీ రమణ మాట్లాడుతూ జేఎస్ఎల్ యాజమాన్యం కనీసం కార్మిక శాఖ అధికారులకు కూడా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అక్రమంగా లాకౌట్ విధించిందని ఆరోపించారు. అక్రమంగా లాకౌట్ విధించిన యాజమాన్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మూడు కార్మిక సంఘాలకు చెందిన 300 మంది కార్మికులు పాల్గొన్నారు.