కాళింగులకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని విజయనగరం జిల్లా కాళింగ సంక్షేమ సేవా సంఘ అధ్యక్షులు పేడాడ జనార్దనరావు కోరారు. శ్రీకాకుళం జిల్లా అమదాలవలస నియోజకవర్గం నుంచి శాసన సభ్యునిగా విజయం సాధించిన కూన రవికుమార్కు మంత్రి వర్గంలో చోటు కల్పించకపోవడంతో తీవ్ర నిరాశ చెందుతున్నామని అన్నారు. శుక్రవారం సంఘ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూన రవికుమార్కు మంత్రి వర్గంలో చోటు కల్పించకపోవడం వెలితిగా ఉందన్నారు. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై భారీ మెజార్టీతో గెలిచి మంచి పేరు తెచ్చుకున్నారని చెప్పారు. కాళింగులకు న్యాయం జరగాలంటే సీఎం చంద్రబాబు నాయుడు పునరాలోచన చేసి కూన రవికుమార్కు మంత్రి వర్గంలో చోటు కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా గౌరవ అధ్యక్షులు పూజారి భాస్కరరావు, ఉపాధ్యక్షులు కె.మురళీధర్, సీపాన వెంకటరావు, తిర్లంగి రాంబాబు, మెట్ట రవి పాల్గొన్నారు.