తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పసుపు పండగ మహానాడు వాయిదా పడింది. ఎన్నికలు, ఫలితాలు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు సంకేతాలు ఇచ్చారు. తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా.. మే 28వ తేదీ కలిసివచ్చేలా ప్రతి ఏటా టీడీపీ మహానాడు నిర్వహిస్తుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.. పార్టీ నేతలంతా ఆ పనుల్లో ఉంటారు కాబట్టి మహానాడు నిర్వహించడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయట. చంద్రబాబు పార్టీ వ్యూహ కమిటీ సభ్యులతో ఈ విషయం చెప్పినట్లు తెలుస్తోంది.
తెలుగు దేశం పార్టీ ప్రతి ఏటా మే 27, మే 28, మే 29 తేదీల్లో టీడీపీ మహానాడు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి ఎన్నికల హడావిడి ఉండటంతో టీడీపీ ఈ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే జూన్ 4న కౌంటింగ్ జరగనుంది.. అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలు ఆ పనుల్లో బిజీగా ఉంటారు. అలాంటి సమయంలో మహానాడు నిర్వహించడం సరికాదనే చెబుతున్నారు నేతలు. 2014 ఎన్నికల సమయంలో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. మే 16న కౌంటింగ్ నిర్వహించగా.. అప్పుడు టీడీపీ విజయం సాధించింది. అప్పుడు ప్రభుత్వ ఏర్పాట్లకు సంబంధించి బిజీగా ఉండటంతో మహానాడును నిర్వహించలేదు. 2019 ఎన్నికల విషయానికి వస్తే.. అప్పుడు టీడీపీ ఓడిపోయింది.. దీంతో 2019లో కూడా మహానాడు నిర్వహించలేదు.
2020, 2021లో కరోనా కారణంగా మహానాడు జరపలేదు.. 2021లో మాత్రం జూమ్ కాల్ ద్వారా మహానాడు నిర్వహించారు. 2022లో ప్రకాశం జిల్లా ఒంగోలులో మహానాడును ఘనంగా నిర్వహించారు.. 2023లో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో టీడీపీ మహానాడు నిర్వహించింది. ఈసారి ఎన్నికలు, కౌంటింగ్తో వాయిదా వేశారు. మళ్లీ 2025లోనే మహానాడును నిర్వహించే అవకాశం కనిపిస్తోంది.