ఏపీ ఎన్నికల్లో గెలుపు మాదంటే మాదేనంటూ వైఎస్సార్సీపీ, టీడీపీ కూటమి ధీమాతో ఉన్నాయి. గురువారం విజయవాడలో ఐప్యాక్ ఆఫీసుకెళ్లిన సీఎం జగన్.. 2019 ఎన్నికలను మించిన ఫలితాలు వస్తాయని.. 22 ఎంపీ సీట్లను గెలవబోతున్నామన్నారు. జూన్ 4న వెలువడే ఏపీ ఎన్నికల ఫలితాలను చూసి దేశం మొత్తం ఆశ్చర్యపోతుందంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ వ్యాఖ్యలు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపాయి.
అయితే జగన్ చెప్పిన స్థాయిలో వైఎస్సార్సీపీ సీట్లు గెలవలేదని.. అయితే ఆ పార్టీనే అధికారంలోకి వస్తుందని జన్మత్ పోల్స్ వెల్లడించింది. ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడం ఈసీ నిబంధనలకు విరుద్ధం కావడంతో.. ఏపీ ఎన్నికలకు సంబంధించి నేటి గ్రౌండ్ రిపోర్ట్ అంటూ.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే వివరాలను జన్మత్ వెల్లడించింది.
వైఎస్సార్సీపీకి 93 నుంచి 96 సీట్లు వస్తాయని అంచనా వేసిన జన్మత్.. టీడీపీ కూటమికి 77 నుంచి 79 సీట్లు వస్తాయని అంచనా వేసింది. పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు కూటమి వైపు మొగ్గు చూపారని.. కానీ గ్రామీణ ప్రాంత ఓటర్లు మాత్రం వైఎస్సార్సీపీ వైపే మొగ్గారని జన్మత్ పోల్స్ తెలిపింది. అయితే పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం ఎక్కువగా ఉందని తెలిపింది.
సరిగ్గా నెల రోజుల క్రితం అంటే ఏప్రిల్ 16న సైతం జన్మత్ పోల్స్ ఏపీ గ్రౌండ్ రిపోర్టును వెల్లడించింది. వైఎస్సార్సీపీకి 122-125 సీట్లు వస్తాయని, టీడీపీ కూటమికి 44-46 స్థానాలు వస్తాయని జన్మత్ పోల్స్ అప్పట్లో అంచనా వేసింది. నెల రోజులు గడిచే సరికి జన్మత్ అంచనాల్లో చాలా తేడా కనిపించింది.
వైఎస్సార్సీపీ గరిష్టంగా 125 సీట్లు వస్తాయని నెల క్రితం చెప్పిన జన్మత్.. ఇప్పుడు 93 సీట్లకు కాస్త అటుఇటుగా వస్తాయని చెబుతోంది. అదే సమయంలో టీడీపీ కూటమి సీట్లు 45 నుంచి సుమారు 80కి పెరుగుతాయని కూడా జన్మత్ అంచనాలను బట్టి చెప్పొచ్చు. ఈ గణాంకాలను బట్టి చూస్తే ఏపీలో హోరాహోరీ పోరు ఖాయమని జన్మత్ చెబుతున్నట్టే.
అయితే ఏపీ ఓటర్లు ఎప్పుడూ వన్ సైడ్ ఫలితాన్ని ఇవ్వడంతోపాటు అధికార, ప్రతిపక్షాల మధ్య సీట్లలో తేడా ఎక్కువగా ఉంటోంది. 2014లో బాబు వైపు మొగ్గిన ఏపీ ప్రజలు.. 2019 ఎన్నికల్లో ఏకపక్షంగా జగన్కు అధికారాన్ని కట్టబెట్టారు. వైఎస్సార్సీపీ నేతలు సైతం ఊహించని రీతిలో 151 స్థానాల్లో జగన్ పార్టీని గెలిపించారు. మరి ఇప్పుడు హోరాహోరీ పోరు జరిగిందా..? ఎప్పటిలాగే వార్ వన్ సైడ్ అయ్యిందా? అనేది జూన్ 4న తేలనుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. జన్మత్ పోల్స్ కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ముందే చెప్పింది. కర్ణాటక, తెలంగాణల్లో జన్మత్ అంచనా వేసిన దానికంటే ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి సీట్లు వచ్చాయి.