కేంద్రం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు, ఏకపక్ష కార్మికచట్టాల సంస్కరణలను నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు మంగళవారం భారత్ బంద్ చేపట్టాయి. పది కార్మిక సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్తంగా సంఘటిత, అసంఘటిత కార్మికులు నేడు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొంటున్నారు. బుధవారం కూడా ఈ సమ్మె కొనసాగనుంది.కార్మికుల సమ్మెతో దేశవ్యాప్తంగా పలు చోట్ల జనజీవనం స్తంభించింది. ఒడిశాలో కార్మికులు రోడ్లపైకి చేరి ఆందోళన చేపట్టారు. టైర్లకు నిప్పుపెట్టి నిరసన తెలిపారు. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పశ్చిమ్బంగా రాజధాని కోల్కతాలో సమ్మెకు దిగిన సీపీఎం కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రలో బృహన్ముంబయి ఎలక్ట్రిసిటీ సప్లయ్ అండ్ ట్రాన్స్పోర్ట్ చేపట్టిన బంద్తో ముంబయి వ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కేరళలోనూ పలు చోట్ల కార్మికులు సమ్మె చేపట్టారు. దేశ రాజధాని దిల్లీలోనూ పలు కార్మిక సంఘాలు రోడ్లపై ఆందోళన చేపట్టాయి. మరోవైపు కార్మిక సంఘాల సమ్మెకు కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు, ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగుల సంఘాలు, దేశవ్యాప్తంగా రైతులు కూడా మద్దతు పలికారు. కార్మికుల సమ్మెకు మద్దతుగా జనవరి 8,9 తేదీల్లో తాము సమ్మె చేపట్టనున్నట్లు బ్యాంకు ఉద్యోగుల సంఘాలు ప్రకటించాయి. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల సేవలకు అంతరాయం కలగనుంది.