ముంబై: మహారాష్ట్ర సచివాలయంలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముంబై ఉన్న సచివాలయం బిల్డింగ్లో ఏర్పాటు చేసిన సేఫ్టీ నెట్లోకి వ్యక్తి దూకిన ఘటన కలకలం సృష్టించింది. తన డిమాండ్లు నెరవేర్చాలి అంటూ లక్ష్మణ్ చవాన్ అనే వ్యక్తి బిల్డింగ్ రెండో అంతస్థు నుంచి సేఫ్టీ నెట్లోకి దిగి నిరసన తెలిపాడు.పుణెకు చెందిన లక్ష్మణ్ చవాన్ భారత్ ప్రజా సతా అనే సంఘాన్ని నడిపిస్తున్నాడు. సచివాలయంలో పనుల నిమిత్తం వచ్చానని చెప్పి రెండో అంతస్థు వరకు చేరుకున్నాడు. అక్కడి నుంచి సేఫ్టీనెట్లోకి దూకాడు. మహారాష్ట్ర మహిళను సీఎం చేయాలని, రైతుల ఆత్మహత్యలు, స్కూల్లో ఫీజుల తగ్గింపు, నాణ్యమైన రోడ్లు కావాలంటూ నినాదాలు చేశాడు. తన డిమాండ్లను నెరవేరుస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం లిఖిత పూర్వకంగా ఇవ్వాలని పట్టుబట్టాడు. లక్ష్మణ్ సేఫ్టీనెట్లోకి దూకిన వెంటనే అక్కడే పనిచేస్తున్నవ్యక్తి అతని వద్దకు వెళ్లి బయటకు తీసుకురావాడానికి ప్రయత్నించినా లక్ష్మణ్ వినలేదు. అయితే ఎట్టకేలకు ఫైర్ సిబ్బంది ప్రమేయంతో అతన్ని బయటకు తీసుకువచ్చారు. లక్ష్మణ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.