ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు కానున్న తిరుపతి,అమరావతి, విశాఖపట్నం సైన్స్ సిటీల ఏర్పాటుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠ సమీక్షించారు.గురువారం అమరావతి సచివాలయంలోని ఆయన కార్యాలయంలో ఎపి సైన్స్ సిటి ఉపాధ్యక్షులు మరియు సిఇఓ డా.ఎ.కృష్ణారావు,అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంత రాములు ఇతర అధికారులతో సైన్స్ సిటీపై ఏర్పాట్లపై సిఎస్ సమీక్షించారు.ఈ సందర్భంగా సిఎస్ అనిల్ చంద్ర పునేఠ మాట్లాడుతూ తిరుపతి సైన్స్ సిటీ ఏర్పాటుకు సంబంధించి 106 ఎకరాలను ప్రభుత్వం కేటాయించగా ఇప్పటికే 70ఎకరాలను సమకూర్చిందని మిగతా భూమిని కేటాయించేందుకు సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలని చెప్పారు.అలాగే అమరావతిలో సైన్స్ సిటీ ఏర్పాటుకు సిఆర్డిఏ పరిధిలో 30ఎకరాలను కేటాయించాలని ప్రభుత్వం ప్రతిపాదించినందున ఆభూమి కేటాయించే ప్రక్రియను వేగవంతం చేయాలని సిఎస్ అధికారులను ఆదేశించారు.దీనిపై సిఆర్డిఏ ఉన్నతాధికారులను కలవాలని సైన్స్ సిటీ సిఇఓకు సూచించారు.ఇంకా సైన్స్ సిటీ ఏర్పాటుకు సంబంధించిన నిధుల సమీకరణకు ఆర్ధికశాఖతో నిరంతరం సంప్రదించడంతోపాటు పిపిపి తరహాలో నిధుల సమకూర్చేందుకు ప్రభుత్వ అనుమతితో ముందుకు వెళ్లేందుకు కృషి చేయాలని చెప్పారు.
ఎపి సైన్స్ సిటీ ఉపాధ్యక్షులు మరియు సిఇఓ డా.కృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్రంలో తిరుపతి,అమరావతి,విశాఖప్నంలలో మూడు సైన్స్ సిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండగా మొదటగా తిరుపతిలో దీనిని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.2017 జనవరి 4వతేదీన తిరుపతిలో జాతీయ సైన్స కాంగ్రెస్ సమావేశం జరిగిందని ఆతేదీన తిరుపతి సైన్స్ సిటికి ముఖ్యమంత్రి శంఖుస్థాపన చేశారని తెలిపారు.తిరుపతి సైన్స్ సిటీ ఏర్పాటులో భాగంగా తిరుపతిలోని 7కొండలను 7 మ్యూజియంలుగా అభివృద్ధి చేయనున్నామని చెప్పారు. సైన్స్ సిటీల ఏర్పాటుకు నిధుల సమీకరణకు పిపిపి తరహాలోను,ఇతర మార్గాల ద్వారా నిధుల సమకూర్చుకునేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు.వీటి ఏర్పాటుకు ప్రభుత్వం నుండి తగిన నిధులు మంజూరు చేయాలని సిఎస్ కు విజ్ణప్తి చేశారు.