రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు ప్రాజెక్టులకు సహకారం అందించేందుకు ప్రఖ్యాత ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ ఇనిస్టిట్యూట్ (పీఎంఐ) ముందుకు వచ్చింది. ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేసేందుకు.. ఆయా ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న అధికారులకు అవసరమైన శిక్షణ ఇవ్వడం, పలు ప్రాజెక్టుల పనుల ఆలస్యానికి కారణాలను గుర్తించి సలహాలు ఇవ్వడం వంటి సేవలను పీఎంఐ అందిస్తోందని ఆ సంస్థ ప్రతినిధి రాజ్ కలాడి, సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠాకు వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా 5,54,660 మంది సభ్యులు కలిగిన పీఎంఐ, మన దేశంలో 300 పైగా చాప్టర్లను కలిగి ఉందని సంస్థ ప్రతినిధి రాజ్ కలాడి, సీఎస్ కు వివరించారు. మనదేశంలో ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థలైన ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంస్థలకు తమ సేవలు అందిస్తున్న పీఎంఐ , విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్ ప్రాజెక్టు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టుల కోసం పనిచేయడానికి ముందుకు వచ్చింది. ప్రభుత్వ అధికారులకు అవసరమైన శిక్షణ ఇచ్చి వారిలో మేనేజ్ మెంట్ స్కిల్స్ పెంచడం ద్వారా పలు ప్రాజెక్టుల్లో జాప్యాన్ని నివారించి సకాలంలో పూర్తి అయ్యేలా పలు సూచనలు చేయనున్నారు. కీలక మౌలికసదుపాయల ప్రాజెక్టు పనుల పురోగతిని పరీశిలించి సలహాలు ఇవ్వడం, పనుల తీరుపై డాష్ బోర్డు ఏర్పాటు చేయడం, ఆయా ప్రాజెక్టుల్లో పనిచేసే అధికారులకు అవసరమైన శిక్షణ ఇవ్వడం పీఎంఐ ప్రధాన లక్ష్యమని ఆ సంస్థ ప్రతినిధి రాజ్ కలాడి వివరించారు. శరవేగంగా అభివృద్ధి చెందుతోన్న ఏపీలో అధికారులు కూడా చాలా చురుగ్గా పనిచేస్తున్నారని, పీఎంఐకు అన్ని విధాలా సహకరించడానికి సిద్దంగా ఉన్నామని సీఎస్ అనిల్ చంద్ర పునేఠా స్పష్టం చేశారు.