ఈనెల 26న రాష్ట్ర స్థాయిలో విజయవాడ ఇందిరాగాంధి మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లన్నిటినీ రెండు రోజులకు ముందుగానే పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠ అధికారులను ఆదేశించారు.ఈమేరకు గురువారం అమరావతి సచివాలయంలోని ఆయన కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా సిఎస్ పునేఠ మాట్లాడుతూ రానున్న గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘణంగా నిర్వహించేందుకు వీలుగా సంబంధింత శాఖల పరంగా చేపట్టాల్సిన ఏర్పాట్లను ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేనిరీతిలో పటిష్టవంతంగా చేపట్టాలని ఆదేశించారు.వివిధ శాఖలకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమ పధకాలు,కార్యక్రమాలను ప్రజలకు విస్తృతంగా తెలియజేసి అవగాహనను పెంపొందించేందుకు వీలుగా 14కు మించకుండా ప్రత్యేక శకటాలను(Tableaux)ను రిపబ్లిక్ డే పరేడ్ లో ఏర్పాటు చేయాలని సిఎస్ ఆదేశించారు.ఈశకటాల ఏర్పాటులో ఆయా శాఖల ప్రగతి ప్రతిబింబించే రీతిలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే విధంగా వాటిని ఏర్పాటు చేయాలని సిఎస్ పునేఠ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.ఈశకటాల ఏర్పాటును సమచారశాఖ ఆయా శాఖల అధికారులతోను,పోలీస్ అధికారులతోను సమన్వయం చేసుకోవాలని చెప్పారు.గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఏర్పాటు చేసే వివిధ సాంస్కృతి కార్యక్రమాల్లో సాంఘిక సంక్షేమశాఖ రెసిడెన్సియల్ పాఠశాలల విద్యార్ధులకు ప్రాధాన్యతను ఇచ్చి వారిని ప్రోత్సహించేందుకు తగు చర్యలు తీసుకోవాలని అన్నారు.గణ తంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లన్నిటినీ రెండు రోజులు ముందుగానే పూర్తి చేయాలని సిఎస్ అనిల్ చంద్ర పునేఠ సంబంధిత శాఖల అధికారులకు స్పష్టం చేశారు.
తొలుత సాధారణ పరిపాలనశాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్ సమావేశానికి స్వాగతం పలికి మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి వివిధ శాఖల వారీగా చేయాల్సిన ఏర్పాట్లపై ఇప్పటికే సంబంధిత శాఖలకు ఆదేశాలు పంపడం జరిగిందని వివరించారు. ప్రోటోకాల్ విభాగపు అదనపు కార్యదర్శి అశోక్ బాబు వివిధ శాఖల వారీ చేయాల్సిన ఏర్పాట్ల అజెండాను వివరిస్తూ ఏశాఖ ఏఏ పనులు చేయాలనేది వివరించారు.ముఖ్యంగా కృష్టా జిల్లా కలక్టర్ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగే విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద జరిగే వేదిక,ఇతర అన్ని ఏర్పాట్లను ఆయా శాఖలతో సమన్వయం చేయాల్సి ఉందని తెలిపారు.అలాగే సమాచారశాఖ కమీషనర్ గవర్నర్,ముఖ్యమంత్రి వర్యుల సందేశాన్ని ముందుగానే సిద్దం చేయాలని,వేడుకల నిర్వహణలో ఇద్దరు వ్యాఖ్యాతలను ఎంపిక చేసి ఆవివరాలను సాధారణ పరిపాలనాశాఖ తెలియజేయాలని చెప్పారు.అదే విధంగా మంచి పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఏర్పాటుతోపాటు వేడుకలకు విచ్చేసిన ప్రజలందరూ వాటిని తిలకించేదుంకు వీలుగా ప్రత్యేక ఎల్ఇడి తెరలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని తెలిపారు.వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా వేడుకల ప్రత్యక్ష ప్రసారానికి తగిన ఏర్పాట్లు చేయాలని అన్నారు.ఇంకా వివిధ శాఖల వారీ చేయాల్సిన ఏర్పాట్లను చదివి వినిపించారు.
సమాచారశాఖ కమీషనర్ ఎస్.వెంకటేశ్వర్ మాట్లాడుతూ గత ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వివిధ శాఖలకు సంబంధించిన 13 శకటాలను ఏర్పాటు చేయగా రానున్న ఎన్నికల నేపధ్యంలో ఓటర్లకు అవగాహన కలిగించాలన్నఎన్నికల కమీషన్ వారి సూచనల మేరకు ఈఏడాది ఎన్నికల కమీషన్ కు సంబంధించిన శకటంసహా 14 శకటాలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించామని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం ఏడాదిని మహాత్మాగాంధీ 150వ జయంతిగా ప్రకటించిన నేపధ్యంలో విజయవాడ గాంధీ కొండ ఇతివృత్తంతో కూడిన శకటాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.రాష్ట్ర గవర్నర్,ముఖ్యమంత్రి వర్యుల సందేశాలను సిద్దం చేసేందుకు వివిధ శాఖల నుండి సమాచారం ఇవ్వాల్సిందిగా ఇప్పటికే లేఖ వ్రాశామని ఆసమాచారం సకాలంలో అందించేలా చర్యలు తీసుకోవాలని ఆయన సిఎస్ ను కోరాగా జిఎడితో సమన్వయం చేసుకోవాలని చెప్పారు. అనంతరం వివిధ శాఖల వారీ చేయాల్సిన ఏర్పాట్లపై ఆయా శాఖల ఉన్నతాధికారులు వారి శాఖల వారి ఏర్పాట్ల వివరాలను తెలియజేశారు.