విజయవాడ, మేజర్న్యూస్: కాపు రిజర్వేషన్ జరిగితే బీసీలకు ఎటువంటి హాని జరగకుండా చూస్తామని చెబుతున్న ప్రభుత్వం ఇందుకు తగిన విధివిధానాలపై ఎటువంటి స్పష్టత ఇవ్వడం లేదు. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కూడా కాపులు కోరుతున్న బీసీ హోదా, రిజర్వేషన్ల డిమాండ్ మీద వెనుకబడిన వర్గాలకు ఎటువంటి నష్టం ఉండదని చెబుతున్నారు. బీసీలలో ఉన్న అపోహలను తొలగించేందుకు ఊరూరా తిరుగుతున్నానని ఆయన ప్రకటించారు. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం బొరవ్రారిపాలెంలో ఆదివారం ముద్రగడ పర్యటించారు. ఇదే విధంగా రాష్టవ్య్రాప్తంగా పర్యటిస్తూ బీసీలకు తెలియజేస్తామని ఆయన పేర్కొంటున్నారు. బీసీలకు హాని చేసే రిజర్వేషన్లు కాపులు కోరడం లేదని, ఈ విషయాన్ని బీసీ వర్గాలు గుర్తించాలని ఆయన స్పష్టం చేశారు. అయితే కాపులను బీసీల్లో చేర్చే అంశమై మంజునాథ కమిషన్ బహిరంగ సభలు ఏర్పాటుచేసిన చోట్లలో బీసీలు నిరసనలు తెలుపుతున్నారు. కాపులను బీసీల్లో చేర్చవద్దని, తద్వారా రిజర్వేషన్లలో తమ వాటా తగ్గే అవకాశం ఉందని బీసీ నేతలు వాపోతున్నారు. బీసీల్లో గతంలో 93 ఉపకులాలు ఉండేవని, ఇప్పుడు వాటి సంఖ్య 130కు చేరిందని, రిజర్వేషన్ శాతం మాత్రం 27 శాతంగానే ఉంచడం వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుందని బీసీ సంఘం నేతలు పేర్కొంటున్నారు. బీసీలకు రిజర్వేషన్ల విషయంలో బీసీలకు పాయింట్ జీరో జీరో జీరో వన్ పర్సెంట్ కూడా అన్యాయం చేయనని ముఖ్యమంత్రి ఇటీవల ప్రకటించారు. మూడు దశాబ్దాలుగా తమ వెంట ఉన్న బీసీలకు వెన్నంటే ఉంటామని చంద్రబాబు తెలియజేశారు. రిజర్వేషన్ అంశంలో ఒక్క కమ్మ సామాజిక వర్గం నుంచి తప్ప ఇతర అన్ని వర్గాల నుంచి రిజర్వేషన్ కల్పించాలన్న విజ్ఞప్తులు వచ్చాయని మంజునాథ కమిషనర్ పేర్కొన్నారు.
అయితే ఇన్ని అస్పష్టతల మధ్య బీసీల్లో నెలకొన్న అపోహాలు తొలగించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. రిజర్వేషన్ శాతాన్ని కూడా పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. కాపు రిజర్వేషన్ అంశంపై బీసీలకు ఎటువంటి ఇబ్బంది ఉండదని స్పష్టత ఇవ్వాలని పలువురు నేతలు కోరుతున్నారు.