బెంగుళూరు: వేసవి రాకముందే బెంగుళూరు నగరాన్ని మంచినీటి ఎద్దడి ఇబ్బంది పెడుతోంది. రిజర్వాయర్లలో మంచినీటి మట్టాలు గణనీయంగా పడిపోవడంతో మంచినీటి సరఫరాలో రేషన్ విధానాన్ని అమలు చేయాలని వాటర్ బోర్డ్ భావిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నగరానికి నిరంతరాయంగా నీటి సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన రెండు వారాలకే ఈ పరిస్థితి ఏర్పడటం గమనార్హం. బెంగళూరు నగరంతో పాటు ఇతర పట్టణాలు కూడా కావేరీ జలాల మీదే ఆధారపడుతున్నాయి. ఇప్పటికే ఆ నదిలో నీటిమట్టం తగ్గిపోవడంతో నీటి ప్రెషర్ తగ్గిపోతోందని, కాలుష్యం కూడా పెరుగుతోందని అంటున్నారు. వేసవి దృష్ట్యా ముందు జాగ్రత్తలు తీసుకొంటున్న సమయంలోనే రిజర్వాయర్లలో అనుహ్యంగా పడిపోతున్న నీటి మట్టాలతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలున్నాయని వాటర్ బోర్డు అధికారులు భావిస్తున్నారు.