రాబోవు రోజుల్లో మైలవరం నియోజకవర్గానికి కృష్ణాజలాల కంటే ముందే జూన్, జూలై నెలలో గోదావరి జలాలు వస్తాయని ఏపీ జలవనరుల శాఖామంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. గురువారంనాడు పుల్లూరులో జరిగిన గ్రామదర్శిని-గ్రామవికాసం, ఆదరణ-2 మేగా గ్రౌడింగ్ మేళా కార్యక్రమాలలో మంత్రి ఉమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రానున్న కాలంలో మైలవరం నియోజకవర్గం ఆకుపచ్చని మైలవరం నియోజకవర్గంగా మారుతుందని చెప్పారు. నియోజకవర్గంలో మూడు దశాబ్ధాలకుపైగా రైతులు సాగునీటి కోసం ఎత్తిపోతల పథకాలు పెట్టాలనే ఆలోచన ఎవరూ చేయలేదని, రైతుల సాగునీటి ఇక్కట్లను పరిగణలోనికి తీసుకొని బాధ్యతతో రూ.28.82కోట్లతో 22 కొత్త ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేసానని, 33 చెరువులకు పుష్కలంగా సాగునీరు అందేలా కృషిచేస్తున్నట్లు చెప్పారు. మైలవరం నియోజకవర్గంలో అభివృద్ధిని అడ్డుకునేందుకు దొంగలు కోర్టులు కేసులు వేస్తున్నారని, సీసీ రోడ్లు, ఎల్.ఈ.డీ బల్బులు కూడా వేయనీకుండా అడ్డుపడుతున్నారని మంత్ర ఉమా ఆరోపించారు. ఎత్తిపోతల పథకాలపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నట్లు విమర్శించారు. మూడు దశాబ్దాలకుపైగా మైలవరం నియోజకవర్గంలో కనిపించని అభివృద్ధిని నాలుగేళ్ళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో చూస్తున్నారని, అభివృద్ధిని ప్రజలు ఆస్వాదిస్తున్నారని మంత్రి ఉమా తెలిపారు. రూ.2.22కోట్లతో చేపట్టిన దాసుళ్ళపాలెం ఎత్తిపోతల పథకానికి ఆయన ప్రారంభోత్సవం చేసారు. ఈ పథకం ద్వారా 270.45ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు.
పుల్లూరు నుండి సీతరాంపురం తండా వరకు రోడ్డు రూ. 56 లక్షలతో శంకుస్థపాన చేసారు. అనంతరం పుల్లూరులో రూ.30.50 లక్షలతో నిర్మించిన పశువైద్యశాలను ప్రారంభించారు. చిలుకూరివారిగూడెం జిల్లా పరిషత్ హైస్కూల్ లో రూ.28.61 లక్షలలో నిర్మాణం చేసిన అదనపు తరగతిగదులను ప్రారంభించారు. గ్రామంలో ఈ సంవత్సరం 2018 కొత్త పింఛన్లు 208 మంజూరైనట్లు తెలిపారు. నియోజకవర్గంలో 2018సం.కు ఇప్పటివరకు 6782 ఎన్టీఆర్ భరోసా పింఛన్లు వచ్చినట్లు తెలిపారు. డిసెంబర్ మాసంలో 519 పింఛన్లు మంజూరు కాగా, వాటిలో ఒంటరి మహిళలు 440, మత్య్సకారులకు 79 మంజూరైనట్లు తెలిపారు. నియోజకవర్గంలో ఎన్టీఆర్ గృహాలు మూడు విడతల్లో 15594 సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి ఆర్థిక సహాయ నిధి ఇప్పటి వరకు రూ.16.96 కోట్లు 2549 మంది లబ్ధిదారులకు అందజేసినట్లు వివరించారు. మంత్రి దేవినేని ఉమా రాక సందర్భంగా పుల్లూరు గ్రామాల ప్రజలు ఘనస్వాగతం పలికారు. వేలాదిమందికి పైగా ఆయా గ్రామాల ప్రజలు మంత్రి ఉమాపై బంతిపూల వర్షం కురించారు. తీన్మార్ డప్పులతో, బుల్లెట్ వాహనాలతో, దేవినేని ఉమా పాటలతో దద్దరిల్లేలా చేసారు.