భారత నావికా దళంలోకి కొత్తగా 56 యుద్ధ నౌకలు, జలాంతర్గాములను ప్రవేశపెట్టే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు నావికాదళ ప్రధానాధికారి సునీల్ లంబా వెల్లడించారు. నావికా దళంలోకి మూడో విమాన వాహక నౌకను ప్రవేశపెట్టేందుకు పనులు మొదలయ్యాయన్నారు. నావికా దళం భారత తీర ప్రాంతాలపై పూర్తి నిఘా ఉంచుంతోందని చెప్పారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న 32 యుద్ధనౌకలకు అదనంగా మరో 56 యుద్ధ నౌకలు, జలాంతర్గాములు ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నాం. అని సునిల్ లంబా తన వార్షిక ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు.
తీర ప్రాంత రక్షణను పెంచేందుకు దాదాపు 2.5లక్షల చేపలవేట పడవల్లో ఆటోమేటెడ్ ఐడెంటిఫికేషన్ ట్రాన్స్పాండర్స్ ఏర్పాటు చేసే ప్రక్రియను ప్రారంభమైందని సునీల్ లంబా తెలిపారు. అలాగే మరో విమాన వాహక నౌకను ప్రవేశపెట్టే ప్రక్రియ కూడా మొదలైనట్లు వెల్లడించారు. తీర ప్రాంత గస్తీ వాహనాల కాంట్రాక్టును రిలయన్స్ నేవల్ ఇంజనీరింగ్ లిమిటెడ్కు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. సీషెల్స్ ద్వీప సమూహం నావికాదళ స్థావరం ఏర్పాటు చేసే విషయంపై ఆ దేశంతో సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు. ప్రస్తుత మాల్దీవుల్లో పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయని..ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం పెరుగుతుందని వెల్లడించారు.