ఏపీలో 23 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే, కేవలం ఏడు వేల ఉద్యోగాలకే నోటిఫికేషన్ ఇచ్చారని, ఆ తర్వాత సిలబస్, షెడ్యూల్ మారుస్తారని, ఇంతకన్నా దిక్కుమాలిన సీఎం ఎక్కడైనా ఉంటారా? అని చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో నిర్వహిస్తున్న బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, నాడు జాబ్ రావాలంటే బాబు రావాలన్నారని, ఒక్క ఉద్యోగమైనా వచ్చిందా అని ప్రశ్నించిన జగన్, జాబు రావాలంటే బాబు పోవాలని వ్యాఖ్యానించారు.రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను మూసేస్తున్నారని, ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయడం లేదని విమర్శించారు. ప్రతి గ్రామంలో మంచి నీటి సౌకర్యం ఉందో లేదో కానీ, మందు షాపులైతే కనబడుతున్నాయని, ఇక, ఏదైనా పండగ వస్తే ఆర్టీసీ బస్సు ఛార్జీలను ఇష్టానుసారం పెంచుతున్నారని అన్నారు. కరవుతో రాష్ట్రం అల్లాడిపోతుంటే చంద్రబాబు షో చేస్తున్నారని, రాష్ట్ర ప్రజల సమస్యలను పట్టించుకోమని ముఖ్యమంత్రిని చేస్తే, వాటిని పట్టించుకోకుండా పక్క రాష్ట్రాల్లో తిరుగుతున్నారని విమర్శించారు.
2014 ఎన్నికలప్పుడు చంద్రబాబు ఏమన్నాడు? రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీ కాంగ్రెస్ అని, సోనియా గాంధీ అవినీతి అనకొండ అని విమర్శించారని వైసీపీ అధినేత జగన్ ప్రస్తావించారు. ఆరోజున అవినీతి అనకొండ అయిన సోనియా గాంధీ, ఈరోజున అందాల కొండ, ఆనందాల కొండ అయిందా? అని ప్రశ్నించారు.
ఆరోజున రాష్ట్రాన్ని విడగొట్టిన సోనియా గాంధీని గాడ్సే అన్నారని, ఈరోజున ఆమె దేవత అని అంటున్నారని విమర్శించారు. ఆరోజున రాహుల్ గాంధీ లాంటి మొద్దబ్బాయి కూడా దేశాన్ని పరిపాలిస్తాడా? అని నాడు చంద్రబాబు ప్రశ్నించారని, మరి, ఈరోజున, రాహుల్ గాంధీ మేధావి అని ఆయన అంటున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయ విలువలకు చంద్రబాబు పాతరేశారని చెప్పడానికి నిదర్శనం.. కాంగ్రెస్ పార్టీతో ఆయన కలిసిపోవడమేనని అన్నారు.