ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత సంతతి రేడియో జాకీపై హత్యాయత్నం.. ముగ్గురు ఖలిస్థానీలను దోషులుగా తేల్చిన కోర్టు

national |  Suryaa Desk  | Published : Sat, Dec 02, 2023, 10:02 PM

భారత సంతతికి చెందిన రేడియో జాకీపై హత్యయత్నం కేసులో ముగ్గురు ఖలీస్థానీ తీవ్రవాదులను న్యూజిలాండ్ కోర్టు దోషులుగా నిర్దారించింది. ఖలిస్థానీ భావజాలానికి వ్యతిరేకంగా గళం విప్పిన ఆక్లాండ్ రేడియో హోస్ట్ హర్నెక్ సింగ్‌పై హత్యకు ఈ ముగ్గురూ కుట్రలు చేసినట్టు పేర్కొంది. 27 ఏళ్ల సర్వజీత్ సిద్ధూ, 44 ఏళ్ల సుఖ్‌ప్రీత్ సింగ్, అక్లాండ్‌కు మరో వ్యక్తి.. హర్నేక్‌పై దాడికి పాల్పడ్డారు. వేర్పాటువాద ఉద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడటాన్ని తట్టుకోలేకపోయిన ఖలీస్థానీలు.. అతడ్ని హత్య చేయడానికి పూనుకున్నారు. దీంతో 2020 డిసెంబరు 23న ఇంటి వద్దే అతడిపై కత్తులతో దాడిచేశారు.


విచారణ సందర్భంగా న్యాయమూర్తి మార్క్ వూల్‌ఫోర్డ్.. సమాజ రక్షణ, మతోన్మాదానికి వ్యతిరేకంగా బలమైన నిరోధం అవసరాన్ని నొక్కి చెప్పారు. ఇంటి బయటే హర్నెక్ సింగ్‌పై మెరుపుదాడి చేసిన తీవ్రవాదుల బృందం.. 40 కంటే ఎక్కువ కత్తిపోట్లు పొడించింది. దాదాపు మృత్యు ముఖంలోకి వెళ్లిన అతడు కోలుకోవడానికి 350 కంటే ఎక్కువ కుట్లు, అనేక శస్త్రచికిత్సలు చేశారు. ‘ఈ దాడి వెనుక మతోన్మాదం ఉంది. ... ఈ సందర్భంలో శిక్షకు భిన్నమైన విధానం అవసరం. మరింత హింస నుంచి సమాజాన్ని రక్షించడంపై దృష్టి పెట్టాలి ఇతరులను నిరోధించే బలమైన సందేశాన్ని పంపడం చాలా అవసరం’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. మూడు కార్లతో వెంబడించిన దుండగులు.. ఇంటి దగ్గర కారు దిగుతుండగా ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. తీవ్ర గాయాలైన అతడు వారి నుంచి తప్పించుకుని కారులోకి వెళ్లి లాక్ చేసి, హారన్ మోగించాడు. ఆ శబ్దానికి ఇరుగుపొరుగు వారు బయటకు రావడంతో నిందితులు అక్కడ నుంచి పరారయ్యారు.


అంతకు ముందు అవతార్ సింగ్ అనే మాజీ బాడీ బిల్డర్ కోర్టులో మాట్లాడుతూ.. అక్లాండ్‌కు చెందిన నిందితుడితో తనకు స్నేహం ఏర్పడిందని, అయితే, అతడికి మాఫియాతో సంబంధాలున్నట్టు తెలిసి 2018 నుంచి దూరం పెట్టినట్టు తెలిపాడు. హార్నెక్‌ను చంపాలని తనను అడిగితే తిరస్కరించానని అవతార్ ఫ్రెండ్ బల్జిందర్ కూడా కోర్టులో వెల్లడించాడు. డిసెంబరు 23న జస్పాల్ సింగ్ తనకు ఫోన్ చేసి.. పని పూర్తయిందని, ఇకపై రేడియోలో అతడి గొంతు వినబడదని చెప్పాడని వివరించాడు. సిక్కు మతానికి సంబంధించిన తన అభిప్రాయాలు ఉదారవాదంతో కూడుకుని ఉంటాయని, అయితే తనపై హత్యాయత్నం చేసివారు సంప్రదాయవాద వైపు ఉన్నారని హర్నేక్ పేర్కొన్నారు. హత్యాయత్నం నేరానికి సంబంధించి సాక్ష్యాలు, ఆధారాలు బలంగా ఉండటంతో ముగ్గుర్నీ న్యాయమూర్తి దోషులుగా నిర్దారించారు. వీరికి వచ్చే ఏడాది శిక్షలను ఖరారుచేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com