వాషింగ్టన్: అమెరికా కాంగ్రెస్లో తొలి హిందూ నేతగా అడుగుపెట్టిన డెమోక్రటిక్ పార్టీ నేత తుల్సీ గబార్డ్ ప్రస్తుతం ఆ దేశ అధ్యక్ష ఎన్నికలపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. 2020లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తుల్సీ పోటీ చేయాలనే యోచనలో ఉన్నట్లు ఆమె సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
గత శుక్రవారం లాస్ ఏంజిల్స్లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రముఖ భారత-అమెరికన్ డాక్టర్ సంపత్ శివంగి మాట్లాడుతూ.. తుల్సీ గబార్డ్ వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారని తెలిపారు. ఆ సమయంలో ఆమె కూడా అక్కడే ఉన్నారు. అనంతరం ప్రసంగించిన తుల్సీ.. సంపత్ మాటలను ఖండించలేదు. దీంతో ఆమె అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. త్వరలోనే తుల్సీ దీనిపై నిర్ణయం తీసుకుని వచ్చే ఏడాది అధికారికంగా ప్రకటించనున్నట్లు సదరు వర్గాలు తెలిపాయి.
ఒకవేళ తుల్సీ అధ్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగితే ఈ ఎన్నికల్లో పోటీ చేసే తొలి హిందూ అభ్యర్థి ఈమే అవుతారు. అంతేగాక.. ఒకవేళ 2020 ఎన్నికల్లో గెలిస్తే అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టే తొలి మహిళగా రికార్డు సాధిస్తారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తుల్సీ నాలుగో సారి ప్రతినిధుల సభకు ఎంపికయ్యారు. హవాయి నుంచి ఆమె గెలుపొందారు.
మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి మళ్లీ గెలవాలని ఆశగా ఉన్నారు. ఇక డెమోక్రటిక్ పార్టీ నుంచి మాజీ ఉపాధ్యక్షుడు జోయ్ బిడెన్, సెనెటర్లు ఎలిజబెత్ వారెన్, క్రిస్టీన్ గిల్లిబ్రాండ్, అమీ క్లొబూచర్, టిమ్ కైనీ, భారత సంతతికి చెందిన కమలా హారీస్ కూడా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.