రెండు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతున్న ఆదరణ-2 కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. పేదలందరికీ ఉపాధి కల్పించేందుకు ఇంత భారీ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. చేతివృత్తుల వారందరికీ ఆధునిక పనిముట్లు అందిస్తామన్నారు. బీసీల్లో ఎక్కువ మంది కులవృత్తిపైనే ఆధారపడి ఉన్నారన్నారు. నాణ్యత, ధర విషయంలో రాజీపడకుండా పనిముట్లు కొనుగోలు చేశామన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా ఉపకరణాలు అందిస్తున్నామన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆదరణ-2 కార్యక్రమం జరుగుతోంది. ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు ఆదరణ పథకం లబ్ధిదారులకోసం ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం ఆదరణ 2 పథకం లబ్ధిదారులకు చంద్రబాబు ఉపకరణాలు, నగదు పంపిణీ చేశారు. ఆదరణ-2 లోగోను చంద్రబాబు ఆవిష్కరించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి చంద్రబాబు ఆదరణ బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేఈ కృష్ణమూర్తి, దేవినేని ఉమ, నక్కా ఆనందబాబు, ఫరూక్, కిడారి శ్రావణ్, ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు పాల్గొన్నారు.