ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నా క్యారెక్టర్‌ను తప్పుబడుతున్నారు.. కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి రోజా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 03, 2023, 09:42 PM

టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి రోజా భావోద్వేగానికి లోనయ్యారు. టీడీపీలో నచ్చక బయటికి వస్తే.. అప్పటి నుంచి తనను టార్చర్‌ చేస్తున్నారని.. తన క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారని కన్నీళ్లు పెట్టుకున్నారు. బండారు సత్యనారాయణ చేసిన వాఖ్యలను టీడీపీ నేతలు స్వాగతిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యుల గురించి ఎవరైనా మాట్లాడితే ఊరుకుంటారా? అంటూ నిలదీశారు. మాట్లాడితే సినిమా వాళ్లు అంటారని.. అసలు టీడీపీ పెట్టింది ఎవరు ఎన్టీఆర్ కాదా అంటూ నిలదీశారు. తనను అన్ని మాటలు అన్న రోజునే తన భర్తను చెప్పుతో కొట్టి ఉంటే మరోసారి ఇలాంటి ఆలోచన రాకుండా ఉంటుందని బండారు భార్యను అడిగారు.


లోకేష్ కూడా ఇలాంటి వ్యాఖ్యలను సపోర్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రోజా. తాను పదేళ్లు టీడీపీలో పనిచేశానని.. ఇప్పటికీ మహిళా సాధికారతకు పాటుపడుతున్నానని చెప్పుకొచ్చారు. 20 ఏళ్లుగా పాలిటిక్స్‌లో ఉన్నానని.. తాను మంత్రిగా ఎదిగితే చూసి ఓర్వలేక ఇలాంటి వాఖ్యలు చేసి బాధపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్‌కు అన్నం కూడా పెట్టని వాళ్లు ఈరోజు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను సినిమాలో నటించే సమయంలో బ్రాహ్మణి చిన్న పిల్ల అని.. తనకు జడలు వేసే వాళ్లమని గుర్తు చేశారు. ఇప్పుడు లోకేష్ ఇచ్చిన స్క్రిప్ట్ బ్రాహ్మణి చదువుతోందన్నారు. తమ నాయకుడు జగన్‌ను అంటే తాము ఊరుకోవాలా.. అని ప్రశ్నించారు. ఖండిస్తే.. తమ క్యారెక్టర్‌లు తప్పుబడుతున్నారని బాధపడ్డారు.


టీడీపీ అంటేనే దండు పాళ్యం పార్టీ.. తెలుగు దుశ్శాసన పార్టీ అంటూ విరుచుకుపడ్డారు రోజా. ఆడ పుట్టుకనే అపహాస్యం చేసిన వ్యక్తి చంద్రబాబు ఆ పార్టీకి జాతీయ అధ్యక్షుడు అని.. ఆడపిల్ల కనిపిస్తే ముద్దు పెట్టాలని చెప్పిన వ్యక్తి బాలకృష్ణ అని చెప్పుకొచ్చారు. ప్రతి మహిళకు మనసు ఉంటుందని.. వాళ్లకు ఫ్యామిలీ, పిల్లలు ఉంటారని గుర్తు చేశారు. దమ్ముంటే తన నియోజకవర్గంకు రావలని.. అభివృద్ధి చూసి దానిపై చర్చ చేయాలని సవాల్ విసిరారు. తన గొంతు నొక్కలని చూస్తే ఊరుకునేదే లేదని తెలిపారు. తనపై అనుచిత వ్యాఖ్యలు వేసే వారిపై.. పరువు నష్టం కేసు వేసి.. కోర్టుకు ఈడుస్తానంటూ మంత్రి రోజా హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com