అమరావతి : బిసిలకు రాజకీయ గుర్తింపునిచ్చింది తెలుగుదేశం పార్టీ మాత్రమేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. భవిష్యత్తులో సైతం బలహీన వర్గాలకు తాము అండగా ఉంటామని అన్నారు. బిసి సామాజిక వర్గానికి చెందిన బచ్చుల అర్జునుణ్ణి ఎమ్మెల్సీగా చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేయటానికి అఖిల భారత యాదవ మహాసభ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్ నేతృత్వంలో ప్రతినిధి బృందం ముఖ్యమంత్రిని గురువారం ఆయన కార్యాలయంలో కలిశారు. బిసిలను తాము కేవలం ఓటు బ్యాంకుగానే చూడటం లేదని, వారి అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలను ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి గుర్తు చేశారు. సబ్-ప్లాన్ అమలు చేస్తున్నామని తెలిపారు. అఖిలభారత యాదవ మహాసభ ఏపీ శాఖ అధ్యక్షుడు లాకా వెంగళరావు మాట్లాడుతూ బిసిలలో తమది అతిపెద్ద సామాజిక వర్గమని, తెలుగుదేశం పార్టీ తమకు మంచి గుర్తింపునిచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశంసించారు. బచ్చుల అర్జునుణ్ణి ఎమ్మెల్సీగా చేసినందుకు మన:పూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రకాశం, కృష్ణా,గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాలలో తమ సామాజిక వర్గం గణనీయ ప్రభావిత శక్తిగా ఉందని వివరించారు. ముఖ్యమంత్రిని కలసిన వారిలో యాదవ మహాసభ కృష్ణాజిల్లా శాఖ అధ్యక్షుడు ఎ.వి.ఆర్ రాజు, ప్రధాన కార్యదర్శి కొణతం శ్రీనివాస యాదవ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆర్. వెంకటాద్రి, యాదవ మహాసభ నేతలు ఎన్.వి.వి.ఎన్ రవి, రాష్ట్ర ఉద్యోగుల సంఘం కార్యదర్శి ఎన్.సి.హెచ్ ఈశ్వరయ్య, కేవీఆర్ యాదవ్, ఆర్ పవన్, డి. సుబ్రహ్మణ్యేశ్వర రావు, కృష్ణాలయం చైర్మన్ జోగా బాలకృష్ణ యాదవ్, గొర్ల రామృకృష్ణ తదితరులు ఉన్నారు.