చెన్నై: సమాజసేవలో తనదైన ముద్ర వేసుకున్నారు నటుడు లారెన్స్. ఆ మధ్య యువకుల సంక్షేమానికి రూ.కోటి విరాళం ప్రకటించారు. ఇప్పుడు ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాల కోసం నిధి సేకరిస్తున్నారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. ఆత్మహత్య చేసుకున్న ఓ రైతు కుటుంబం ఇటీవల నన్ను ఆశ్రయించింది. తమ జీవితం ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వారికి రూ.3 లక్షలు ఇచ్చి పంపించాను. కానీ అది శాశ్వత పరిష్కారం కాదు. తమిళనాడులో ఇప్పటి వరకు 271 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు చెబుతున్నారు. ఆ కుటుంబాలన్నీ వీధిన పడుతున్నాయి. వారికి సహకరించాలని నేను ప్రభుత్వాన్ని కోరను. నాకు రాజకీయాలు తెలియవు. 271 కుటుంబాలకు వ్యక్తిగతంగా నేను నా శక్తి కొద్దీ సాయం అందజేస్తా. విదేశాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించి నిధి సేకరిస్తా. ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షలు ఇవ్వాలని భావిస్తున్నా. ఇందుకోసం పలువురు నటులు, నిర్మాతలు కూడా సహకరిస్తున్నారు. వారందరికీ కృతజ్ఞతలని తెలిపారు