వారణాసి: మోదీ సొంత నియోజకవర్గమైన వారణాసిలో ఒక్కసారిగా ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ప్రధాని మోదీ శనివారం ఉదయం భారీ షో నిర్వహించడంతో, దీనికి సమాంతరంగా అఖిలేష్ యాదవ్, రాహుల్ సంయుక్తంగా గ్రాండ్ రోడ్షో జరిపారు. కొద్ది సేపటి క్రితమే మొదలైన ఈ రోడ్షోలో ఎస్పీ-కాంగ్రెస్ అభిమానులు పెద్దఎత్తున పాల్గొని అఖిలేష్, రాహుల్ నినాదాలతో హోరెత్తించారు. ఎక్కడచూసినా ఇరు పార్టీల జెండాలు రెపరెపలాడాయి. కచెహ్రి చౌరాహా వద్ద ప్రారంభమైన రోడ్షో గిర్జాఘర్ చౌరహా వరకు సాగనుంది. మధ్యలో నదేసర్, చౌక్ఘాట్, దోషిపుర, గోల్గంజ్, పీలి కోథి, మైదాగిన్ ప్రాంతాల మీదుగా పది కిలోమీటర్ల మేర ఈ రోడ్షో సాగనుంది. ఇరు పార్టీలకు చెందిన హేమాహేమీలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. వారణాసి ర్యాలీని బీజేపీతో సహా ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడం, చివరి దశ పోలింగ్ 8న జరగనుండటంతో వారణాసిలో ప్రచారహోరు తారాస్థాయికి చేరుకుంది.